తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు ముహూర్తం పెట్టేసుకొన్నారా?అంటే అవుననే చెపుతున్నారు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ,మల్లారెడ్డి.
నిన్న హనుమకొండ జిల్లా కాజీపేటలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ఈ ఏడాది దసరానాడు (అక్టోబర్ 5)న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తారు. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మూడినట్లే. వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని సిఎం కేసీఆర్ గద్దె దించడం ఖాయం,” అని అన్నారు.
మల్లారెడ్డి సిఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. సాధారణంగా సిఎం కేసీఆర్ తన మనసులో ఆలోచనలను అటువంటి ముఖ్యనేతల ద్వారానే ముందుగా ప్రజలకు చేరేలా చేస్తుంటారు. కనుక మంత్రి మల్లారెడ్డి చెప్పిన ఈ మాట నిజమే అని భావించవచ్చు.
దసరా నాటికీ కొత్త సచివాలయం అందుబాటులోకి రాగానే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి తన కుమారుడు, మంత్రి కేటీఆర్ను ముఖ్యమంత్రిగా నియమించి, సచివాలయంలో కూర్చోబెట్టి తను దిల్లీకి వెళ్లిపోవచ్చని ఇదివరకే మిర్చి 9 ఊహించి చెప్పింది.
దానిలో దసరానాడు సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం నిజం కాబోతోందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు కనుక మంత్రి కేటీఆర్ అదే రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు.
ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఇటు ప్రభుత్వంలోను, అటు పార్టీలో సమర్ధుడైన మంత్రిగా, నాయకుడిగా మంచిపేరు సంపాదించుకున్నారు. కనుక దసరానాడు ఆయన పట్టాభిషేకానికి ఎవరికీ అభ్యంతరాలు, ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.



