మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములలో నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసు గురించి ఆయనే చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు.
“ఆరోజు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కలిసి కాకినాడ పోర్టులో తనికీలు చేసి 31 గోదాములలో 22,000 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తే కోర్టుకి బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి షిప్పులో ఎక్కించారు. మళ్ళీ అప్పుడూ పవన్ కళ్యాణ్ వెళ్ళి ‘సీజ్ ది షిప్’ అనడంతో ఆ బియ్యాన్ని షిప్పులో నుంచి దించేశారు.
మొత్తం 120 మంది రైస్ మిల్లుల నుంచి ఆ రేషన్ బియ్యం గోదాములకు అక్కడి నుంచి షిప్పులో విదేశాలకు రవాణా అవుతోందని ప్రభుత్వం గుర్తించింది. మంచిదే!
‘సీజ్ ది షిప్’ అని స్వాధీనం చేసుకున్న ఆ 22,000 టన్నుల రేషన్ బియ్యం ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది?రేషన్ బియ్యం మిల్లింగ్ చేసి పంపినవారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇంత భారీగా బియ్యం తరలిపోతుంటే పౌర సరఫరాల శాఖలో ఏ ఒక్క అధికారిపై ఇంత వరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదు?
ఈ రేషన్ బియ్యం రవాణా విషయంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ఒక్కడిపై మాత్రమే కేసు నమోదు చేశారు? మిగిలినవారందరినీ చూసి చూడనట్లు వదిలేశారు. ఎందుకు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటపెట్టారు. కనుక వైసీపీ హయంలో కాకినాడ పోర్టు నుంచి 5 ఏళ్ళ పాటు సాగిన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అందరూ ఆశించారు.
కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సమాధానం చెపుతారా?




