ఆంధ్రా, తెలంగాణ రాజకీయాలలోనే కాదు… చివరికి శాసనసభ బడ్జెట్ సమావేశాలలో కూడా జగన్, కేసీఆర్ ఒకేలా వ్యవహరిస్తుండటం విశేషం. కేసీఆర్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు రావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద సమాధానం లభించడం లేదు. కేసీఆర్ తాను హాజరు కాకపోయినా తన ఎమ్మెల్యేలందరినీ శాసనసభ సమావేశాలకు పంపిస్తున్నారు. అదే ఆయన పరువు కాపాడుతోందని చెప్పవచ్చు.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు 7వ రోజు కొనసాగబోతున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధినేత కేసీఆర్ రాలేదనుకోకుండా అందరూ ధైర్యంగా సమావేశాలకు హాజరయ్యి బడ్జెట్పై చర్చలో పాల్గొంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని శాసనసభలో గట్టిగా నిలదీస్తూ ధీటుగా ఎదుర్కొంటున్నారు కూడా.
మొన్న సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశం ఏకధాటిగా 17 గంటలు సాగి నిన్న (మంగళవారం) తెల్లవారుజామున 3.15 గంటల వరకు సాగింది. అంత సుదీర్గంగా సమావేశం జరిగినా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరూ ఏదో సాకుతో బయటకు వెళ్లిపోకుండా బడ్జెట్పై అర్ధవంతమైన చర్చలలో పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటూ బడ్జెట్ చర్చలలో పాల్గొంటూ కేసీఆర్ పరువు కాపాడుతున్నారనే చెప్పాలి.
కానీ ఏపీలో జగన్ శాసనసభ సమావేశాలకు రాకపోగా తనతో పాటు వైసీపి ఎమ్మెల్యేలు కూడా శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా చేస్తున్నారు.
బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా ఢిల్లీలో ధర్నా చేసి ప్రజా సమస్యలపై పోరాడామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అయినా జగన్ పట్టించుకోలేదు.
శాసనసభ సమావేశాలకు రానప్పుడు మీకు ఆ ఎమ్మెల్యే పదవులు మాత్రం దేనికి రాజీనామాలు చేయండని వైఎస్ షర్మిల అడగడం సహేతుకంగానే ఉంది.
శాసనసభ సమావేశాలను రాకపోయినా జగన్ తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు కోరుతున్నారో వైసీపిలో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఎలాగూ విఫలం అయ్యారు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించ లేకపోతున్నారు. అయినా ప్రగల్భాలు మాత్రం తగ్గడం లేదు.




