తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయటకు పొక్కినప్పటి నుంచి రాష్ట్రంలో మరే సమస్యలేన్నట్లు అధికార, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు ఆ రాజకీయ వరద ప్రవాహంలో చిక్కడి కొట్టుకుపోతూనే ఉన్నారు. మొదట సిఎం చంద్రబాబు నాయుడే ఈ వరదని సృష్టించినప్పటికీ, ఆ తర్వాత నుంచి జగన్ ‘బుడమేరు గేట్లు’ ఎత్తిన్నట్లు ఈ వరద ఫ్లో ఎక్కడా తగ్గకుండా మెయిన్టెయిన్ చేసేందుకు ఎప్పటికప్పుడు కల్తీ గేట్లు ఎత్తి దించుతున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. కనుక కల్తీ వరద ఇంకా ఎప్పటికీ తగ్గుతుందో… దానిలో ఏ పార్టీ కొట్టుకుపోతుందో ఎవరికీ తెలీదు.
అయితే టిడిపి కూటమి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నది ఇది కాదని, అప్పుడే వంద రోజులు పూర్తిచేసుకొని నాలుగో నెలలో అడుగు పెట్టామని మరిచిపోకూడదు.
అమరావతి, పోలవరం నిర్మాణ పనుల గురించి, పరిశ్రమలు, పెట్టుబడుల గురించి కూటమి ప్రభుత్వంలో మంత్రులు నాలుగు ముక్కలు మాట్లాడితే వినాలని రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఎన్నికల హామీలు, సంక్షేమ పధకాల గురించి నిర్ధిష్టమైన నిర్ణయాలు ప్రకటిస్తే వినాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను ఎందుకు అధికారం కట్టబెట్టారంటే జగన్ వల్ల కానీ అభివృద్ధి పనులను వారిరువురూ పరుగులు పెట్టిస్తారనే ఉద్దేశ్యంతోనే కదా?
సాధారణంగా అధికార పార్టీలు మొదటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి, సంక్షేమ పధకాలపైనే దృష్టి సారించి, చివరి ఆరు నెలలో ఏడాదిలోనే ఇటువంటి రాజకీయాలు చేస్తుంటాయి.
కానీ జగన్ ఓటమి షాక్ నుంచి మూడు నెలల్లోనే తేరుకొని, ఇంతగా రాజకీయ బురదని సృష్టిస్తుంటే దానిలో టిడిపి కూటమి ప్రభుత్వం చిక్కుకొని, ఆయన కోరుకున్నట్లుగా బురదలో ఆటలాడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటే చివరికి నష్టపోయేది ఎవరు?అని కూటమిలో ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.
జగన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చాలా అవసరం… చాలా ముఖ్యమే. కానీ అభివృద్ధి కంటే అదే చాలా ముఖ్యమన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.
అవసరమనుకుంటే టిడిపి, జనసేన, బీజేపీలలో పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారికి జగన్ బాధ్యత అప్పగించి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడితే ప్రజలు సంతోషిస్తారు.




