మీడియా, జర్నలిజం పేరుతో నోటికి వచ్చినట్లు వాగవచ్చా? ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురించి అనుచితంగా మాట్లాడవచ్చా?అంటే వచ్చని జగన్ & కో వాదిస్తున్నారు.
‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను కించపరుస్తూ, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే ‘సాక్షి’ మీడియా కనుక దానిని ఎవరూ ఏమీ అనకూడదు. అలా వాగినవారిపై చర్యలు తీసుకోకూడదు. తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు. మీడియాపై దాడిగా అభివర్ణిస్తోంది వైసీపీ.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేయకూడని తప్పులు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసినందుకు పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తుంటే ఇలాగే రాజకీయ కక్ష సాధింపు అంటూ వితండవాదం చేస్తోంది.
టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడులు, గోదాములలో రేషన్ బియ్యం మాయం అవ్వడం, కాకినాడ పోర్టు నుంచి బహిరంగంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడం, ఇప్పుడు సాక్షి మీడియాలో ‘అమరావతి వేశ్యల రాజధాని’ అనడం వంటివి కళ్ళకు కనిపిస్తున్న నేరాలే కదా?
ఈవిదంగా రకరకాల నేరాలు చేస్తూ వాటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోరాదని వాదించడం రాజకీయ మందబలం కారణంగా చేస్తున్న వాదనలే.
అసలు ప్రజలకు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సిన సాక్షి మీడియా ‘జగన్ మనసాక్షి’గా ఆయన దురాలోచనలకు అద్దం పడుతుండటమే తప్పు.
పైగా జగన్ కోసం పనిచేస్తూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు మార్గంలో పయనిస్తున్నప్పుడు, ఆయనకు మార్గదర్శనం చేయకపోగా ఆయన చేసిన తప్పులను, భ్రమలను సమర్ధిస్తూ వైసీపీ ఓటమికి కూడా కారణం అయ్యింది కదా?
కనీసం జగన్కు మేలు చేయాల్సిన సొంత మీడియా ఈవిదంగా అమరావతిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కొత్త సమస్యలు సృష్టిస్తే, అందుకు కొమ్మినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకుండా, ఆయనని వెనకేసుకు వస్తూ వైసీపీ వాదిస్తూ మరిన్ని సమస్యలు సృష్టించుకుంటోంది.
ఇందుకు కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకరి తప్పులు మరొకరు వెనకేసుకువస్తూ.. జగన్, సాక్షి మీడియా ఊబిలో కూరుకుపోతున్నామనే సంగతి గ్రహించడం లేదు.




