ఇది వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలకు నరకం చూపారు. ఆ వేధింపులు భరించలేక రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన ‘అమర్ రాజా బ్యాటరీస్’ హైదరాబాద్కు తరలిపోయి అక్కడ రూ.9,000 కోట్లు పెట్టుబడితో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంది.
ఇంకా ‘లూలు గ్రూప్’ వంటి అనేక కంపెనీలు జగన్ ప్రతాపం చూసి భయపడి తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు తరలిపోయాయి.
అప్పటి నుంచే పారిశ్రామికవేత్తలకు ‘జగన్ ఫోబియా’ పట్టుకుంది. జగన్ వలన వారికి భవిష్యత్లో ఎటువంటి సమస్యలు రావని తాను ఎంత భరోసా ఇస్తున్నా ఇంకా భయపడుతూనే ఉన్నారని, వారి భయం పోగొట్టి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం చంద్రబాబు నాయుడు నిన్నే చెప్పారు.
నాడు జగన్ ఏవిదంగా వ్యవహరించారో ఇప్పుడు కేరళ ప్రభుత్వం కూడా సరిగ్గా అలాగే వ్యవహరిస్తోందని ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్ యజమాని సాబు జాకబ్ ఆరోపించారు.
కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక కార్మికులకు అనుకూలంగా వ్యహరించడం సహజం. కానీ అంత మాత్రాన్న కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలు, వాటి యాజమానులని వేధించడం సరికాదు. కానీ ఏదో వంకతో తమని కేరళ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉందని సాబు జాకబ్ ఆరోపించారు.
కేరళలో పరిశ్రమ నడపలేని పరిస్థితి నెలకొందని కనుక ఆంధ్రాలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో దుస్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
తమకు ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో పరిశ్రమలు ఉన్నాయని, ఇప్పుడు ఆంధ్రాలో కూడా పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నామని సాబు జాకబ్ చెప్పారు. విశాఖలో అచ్యుతాపురం వద్ద అనేక బట్టల తయారీ కంపెనీలున్నాయి. కనుక కైటెక్స్ కంపెనీకి అక్కడే స్థలం కేటాయించే అవకాశం ఉంది.
ప్రభుత్వాలు వాటి అధినేతలు పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించకపోయినా పరవాలేదు. కానీ ఈవిదంగా వేధించి పారిపోయేలా చేయకూడదు, చేస్తే ఏమవుతుందో అమర్ రాజా, లూలు చెప్పాయి. ఇప్పుడు కైటెక్స్ చెపుతోంది.




