ఒకప్పుడు నారా లోకేష్ తెలుగులో మాట్లాడేటప్పుడు తడబడేవారు. ఆ పాయింట్ పట్టుకొని వైసీపీ నేతలందరూ ఆయనని ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు. బాడీ షేమింగ్ సరేసరి.
కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేరు.. అంటూ అవహేళన చేసేవారు. కానీ నారా లోకేష్ ఆ ఓటమి, అవహేళలకు క్రుంగిపోకుండా వాటి నుంచే పాఠాలు నేర్చుకున్నారు. తనని తాను తీర్చి దిద్దుకున్నారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే!
అయితే నారా లోకేష్ని ఇంతగా అవమానించి అవహేళన చేసిన వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏమిటి? సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టాలన్నా కూడా తడబడుతూ కాగితంపై ఎవరో వ్రాసిచ్చినది చదువుతుంటారు. పాలనాపరమైన అంశాల గురించి మాట్లాడాలంటే మరింత తడబడతారు.
జగన్ కాస్త ఆశువుగా చెప్పగలిగే మాటలు ఏవైనా ఉన్నాయంటే అవి సంక్షేమ పధకాలు మాత్రమే. అవి కూడా వేలసార్లు బట్టీ కొట్టడం వల్లనే సాధ్యపడింది తప్ప అంత సులువుగా అబ్బలేదు. కనుక ఇప్పుడు జగన్-లోకేష్ ప్రసంగాలలో కూడా తేడా చాలా స్పష్టంగా కనబడుతోంది.
పైగా ఇప్పుడు నారా లోకేష్ మాటలలో ఉచ్ఛారణ మాత్రమే కాదు.. పదాల విరుపులు కూడా అపురూపంగా వినపడుతున్నాయి.
మంగళగిరిలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ, “అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అందరం ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. 150 కాస్త 11 ఎందుకైంది? వారి అహంకారమే కారణం.
ఆనాడు కాలరేగరేశారే.. మీసాలు మేలేశారే.. ఎక్కడున్నారిప్పుడు?రావయ్యా అసెంబ్లీకి అంటే భయపడుతున్నారు. జెడ్ ప్లస్ భద్రత కల్పించినా రావడం లేదు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. ఒక పైలట్.. ఒక ఎస్కార్ట్ వాహనం… ఇన్ని ఇచ్చినా అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు..” అంటూ నారా లోకేష్ దుమ్ము దులిపేస్తుంటే ఆయన మాటలు.. వాటిలో ఆ విరుపు.. ఆయన హావభావాలు చూసి అందరూ సంతోషంగా నవ్వుకున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలోనే తన విశ్వరూపం చూపిస్తూ ముందుకు సాగుతుంటే, ఆయన తమ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఏం మాట్లాడుతారో?అని ఆనాడే వైసీపీ నేతలు భయపడేవారు.
ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. కనుక నారా లోకేష్ని ధీటుగా ఎదుర్కోగల నాయకుడు వైసీపీలో ఒక్కరూ కనిపించడం లేదు.
నారా లోకేష్ ఏకు మేకయ్యేలా తీర్చిదిద్దింది కూడా వైసీపీ నేతలే. కనుక ఇది కూడా వారి స్వయంకృతాపరాధమే. చారిత్రిక తప్పిదమే అని చెప్పక తప్పదు.




