జగన్ మొన్న తాడేపల్లి ప్యాలస్ ప్రెస్మీట్లో పరకామణి దొంగతనం గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరకామణిలో జస్ట్ 9 డాలర్లు దొంగతనం అయితే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తోందని ప్రశ్నించారు. అంతేకాదు 9 డాలర్లు అంటే రూ.72,000 అని… అది చాలా చిన్న దొంగాతమని చెప్పారు!
జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అనేక వ్యాపారాలున్నాయి. ఐదేళ్ళపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తరచూ విదేశాలకు వెళ్ళి వస్తుంటారు. కనుక తొమ్మిది అమెరికన్ డాలర్ల భారతీయ కరెన్సీ విలువ ఆయనకు తెలియదనుకోలేము. కానీ 9 డాలర్లకు రూ.72,000 అని చెప్పారు!
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ పడిపోయిందని ఈరోజే చెప్పారు. కానీ జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఒక డాలరుకి రూ. 8,000లు.
సరే!ఆయన పొరపాటున 900 డాలర్లు అనబోయి తొమ్మిది డాలర్లు అన్నారని అనుకోవడానికి కూడా లేదు. ఆయన కాగితం మీద వ్రాసి ఇచ్చినది పదేపదే చూస్తూ తొమ్మిది డాలర్లకు రూ.72,000 అని చెప్పారు! దానికి ఇంత రాద్దాంతం దేనికని ప్రశ్నించారు. అంటే పరకామణిలో చిల్లర దొంగతనాలను చూసి చూడనట్లు ఊరుకోమని చెపుతున్నారన్న మాట! పైగా అదేమీ తప్పు కాదన్నట్లు మాట్లాడారు.
జగన్ చెప్పినట్లు అది 9 డాలర్ల చిల్లర దొంగతనమే అయితే దొంగతనం చేసిన రవి కుమార్ టిటిడీకి వంద కోట్లకు పైగా ఆస్తులు ఎందుకు రాసిచ్చినట్లు? ఈ కేసులో వైసీపీ నేతలు అతనితో ఎందుకు రాజీ పడ్డారు? అతనిపై కేసు ఎందుకు ఉపసంహరించుకున్నారు?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్ ధోరణి ఈవిధంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరగకుండా ఉంటాయా?
మద్యం కుంభకోణం కేసులో రూ.3,000 కోట్లు పైగా చేతివాటం ప్రదర్శించారని ఏసీబీ చెపుతోంది కదా? అది రాజకీయ కక్ష సాధింపు కేసు తప్ప ఎక్కడా అవినీతి జరగలేదని జగన్ వాదిస్తున్నారు.
పరకామణి దొంగతనాన్ని జగన్ సమర్దిస్తున్నారు కనుక ఈ రూ.3,000 కోట్ల దొంగతనాన్ని కూడా చూసి చూడనట్లు వదిలేయాలంటున్నారా?




