హోర్మూజ్ జలసంధిని తెరిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు ట్రంప్. లేకుంటే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచదేశాలపై చాలా భారం పడుతుందన్నారు.
ఇరాన్ గొప్ప శుభవార్త చెపుతుందన్నారు ఒకసారి. హోర్మూజ్ తెరిపించేందుకు అన్ని దేశాలు కలిసి రావాలన్నారు. రాకపోవడంతో మాకు హోర్మూజ్ అవసరం లేదు వెళ్ళి మీ చావు మీరు చావండన్నారు. తెరవకపోతే ఇరాన్ నాగరికత తుడిచి పెట్టేస్తామని డెడ్లైన్లు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక్క నౌక కూడా హోర్మూజ్ గుండా వెళ్ళకుండా అడ్డుకుంటున్నది ట్రంపే! ఇప్పుడు చమురు కొరత ఏర్పడితే ప్రపంచ దేశాలపై భారం పడదా?
అమరావతిని వ్యతిరేకించడం లేదంటారు జగన్. కానీ రాజధానిగా అమరావతిని అంగీకరించమంటారు. మూడు రాజధానులు అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకే అన్నారు జగన్. మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి టీడీపిని చావు దెబ్బ తీయడమే వైసీపీ వ్యూహం ఫెయిల్! కనుక ఇప్పుడు మావిగన్ కొత్త పాట.
అమరావతిపై అన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేయడం? దానిలో ‘జస్ట్ పది శాతం’ ఖర్చుతో ‘ఇన్స్టాంట్ రాజధాని మావిగన్’ ఏర్పాటవుతుంది కదా? అని జగన్ వాదన.
అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ ఐడియా రాలేదా? విశాఖ ఎందుకన్నారు? అంటే రాష్ట్రంలో బెస్ట్ సిటీ విశాఖపట్నమేగా సజ్జల మేధావి ఉవాచ! అయితే రాత్రికి రాత్రి హటాత్తుగా మావిగన్ బెస్ట్ సిటీలుగా మారిపోయాయా? మరి విశాఖ?
ఇరాన్ వద్ద అణ్వాయుధాలతో ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉంది కనుక ప్రపంచ శాంతి కోసం యుద్ధం చేస్తున్నామంటారు ట్రంప్. కానీ చేస్తున్నది ఇరాన్ చమురు నిక్షేపాల కోసం! మావిగన్ పేరుతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ లక్ష్యం. కానీ మావిగన్ ప్రజల కోసమే తన పోరాటం అంటారు.
ఆఫ్ఘనిస్తాన్ కోసం మా అమెరికన్ల కష్టార్జితం, మా సైనికుల ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరమా? అని ప్రశ్నిస్తూ అమెరికా దళాలను వెనక్కు రప్పించారు ట్రంప్! ఇప్పుడు ఆయనే ఇరాన్తో యుద్ధం చేస్తూ ఖర్చు చేస్తున్నది ఎవరి సొమ్మో? విశాఖ రాజధానికి ఐకాన్ 500 కోట్ల రుషికొండ ప్యాలస్. ఆ ఐకాన్ ప్యాలస్ భారం ప్రజలపైనేగా?
అమెరికన్ల ప్రాణాలకు మాత్రమే విలువ కానీ ఇరాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తే పోయే ప్రాణాలకు విలువ లేదా? ఇరాన్ యుద్ధంలో చనిపోయే అమెరికన్ సైనికుల ప్రాణాలకు లెక్కలు వేరేనేమో? వాలంటీర్లే వైసీపీ ప్రభుత్వానికి వెన్నెముక. ఇప్పుడా వెన్నెముకలు ఎక్కడున్నాయో జగన్కి తెలీదు.. అవసరమే లేదు!
జగన్, ట్రంప్ ఇద్దరికీ ఉన్నది ఒకటే నాలిక. కానీ పూటకో ఐడియా… రోజుకో మాట!




