వ్యూహాలన్నీ ఇలా బెడిసి కొడుతున్నాయేమిటి మావయ్యా?

jagan-reddy-mudragada-krishnaiah

కేసీఆర్‌ ‘తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తుంటారు. అదేవిదంగా జగన్‌ ఎప్పుడూ వ్యూహాలతోనే రాజకీయాలు చేస్తుంటారు.

ADVERTISEMENT

జగన్‌ తుమ్మినా దగ్గినా అది వ్యూహాత్మకంగా ఉందో లేదో చూసుకుంటారంటే అతిశయోక్తి కాదు. కానీ పాపం ఆయన వ్యూహాలు ఎప్పుడూ బెడిసి కొడుతూనే ఉంటాయి.

ఇందుకు అనేక ఉదాహరణలు కోకొల్లలున్నాయి. కోడి కత్తి, గులకరాయితో హత్యాయత్నం, స్టిక్కర్స్, యుద్ధం, సిద్దం నినాదాల వంటి వ్యూహాలు మొదలు ముద్రగడ పద్మనాభ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యలను వైసీపిలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవడం వరకు చాలానే ఉన్నాయి. ముద్రగడతో వైసీపి నష్టపోవడమే కాకుండా జగన్‌ని నమ్ముకొని వైసీపిలో చేరినందుకు ఆయన కూడా నవ్వులపాలయ్యారు. సహవాస దోషం అంటే ఇదేనేమో?

మరో తాజా ఉదాహరణగా వైసీపి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య రాజీనామా. రాష్ట్రంలో టిడిపివైపు ఉన్న బీసీలందరినీ వైసీపి వైపు తిప్పుకోవలసిన అవసరం ఉందని జగన్‌ గుర్తించి, వెంటనే తెలంగాణకి చెందిన బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్యని ఆంధ్రాకి డౌన్‌లోడ్‌ చేసి వైసీపి తరపున 2022లో రాజ్యసభ టికెట్‌ ఇప్పించారు.

వైసీపిలోనే బోలెడు మంది బీసీ నేతలు ఉండగా, పొరుగు రాష్ట్రం నుంచి ఆర్‌.కృష్ణయ్యని తీసుకురావడాన్ని వైసీపి నేతలే వ్యతిరేకించారు. కానీ జగన్‌ ఏదైనా చాలా ఆలోచించి వ్యూహాత్మకంగానే చేస్తారు కనుక ఈ డౌన్‌లోడ్‌ కూడా అటువంటిదే అని అందరూ సరిపెట్టుకోక తప్పలేదు.

అయితే ఆర్‌.కృష్ణయ్య అప్పనంగా లభించిన రాజ్యసభ సీటు సంతోషంగా తీసుకున్నారు కానీ వైసీపికి చేసిన మేలు ఏమీ లేదు. ఉండి ఉంటే శాసనసభ ఎన్నికలలో వైసీపి గెలిచి ఉండేది. ఇప్పుడు ఆయన కూడా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి జగన్మోహన్‌ రెడ్డికి మరో షాక్ ఇచ్చారు.

దానిని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఆ సీటు ఖాళీ అయిన్నట్లు ప్రకటన కూడా వెలువడింది. కనుక ఆర్‌.కృష్ణయ్య విషయంలో కూడా జగన్‌ వ్యూహం బ్యాక్ ఫైర్ లేదా ఫెయిల్ అయ్యిందని స్పష్టం అవుతోంది.

ఇప్పటికే మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు ముగ్గురి రాజీనామాలతో వైసీపి రాజ్యసభ సభ్యుల సంఖ్య 11 నుంచి 8కి పడిపోయింది. త్వరలో మరో ముగ్గురు రాజీనామాలు చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్‌ రాజ్యసభ సభ్యులపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. మోడీ ప్రభుత్వానికి రాజ్యసభలో తగినంత బలం లేదు కనుక 11 మందితో మోడీకి మద్దతు ఇస్తూ కేసులు, రాబోయే ఇతర కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చని జగన్‌ ఆశ, ఆరాటపడటం సహజం. కానీ ఇప్పుడు వరుస రాజీనామాలతో ఆ ఆశ కూడా సన్నగిల్లిపోతోంది.

పైగా ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం జగన్‌ మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. దాని వలన తమ రాజకీయ భవిష్యత్‌ ఏమవుతుందో అని వైసీపి నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనుక ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం మరో కొత్త వ్యూహం సిద్దం చేసుకోవడమే! ప్రస్తుతం జగన్‌ అదే పనిలోనే ఉన్నారేమో?

ADVERTISEMENT
Latest Stories