నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం… మహిళలందరికీ శుభాకాంక్షలు!
పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఏపీ మాజీ సిఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు.
“సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది. వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా,” అని జగన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన వెంటనే మొదట ఎవరికైనా ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల టక్కున గుర్తువస్తే అది వారి తప్పు కాదు. అలాగే బాబాయ్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా కళ్ళ ముందు మెదులుతారు. ఎందుకో అందరికీ తెలుసు.
సొంత కుటుంబంలోని మహిళలనే కోర్టుల చుట్టూ తిప్పుతూ జగన్ ఇలాంటి ట్వీట్ చేస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ నవ్వితే నవ్వుపోదురు గాక… నాకేటి.. అని ముందుకు సాగిపోక తప్పదు.
ఇద్దరు చెల్లెమ్మల ఒక చెల్లి ఆస్తుల కోసం తిరుగుతుంటే, మరో చెల్లి తండ్రి హత్యకు న్యాయం కోరుతూ తిరుగుతున్నారు. కానీ అన్న మనసు కరగలేదు. వైసీపీ కాలకేయ సైన్యం చేత సోషల్ మీడియాలో తమపై దాడులు చేయించారని ఇద్దరు చెల్లెమ్మలు బహిరంగంగానే ఆరోపించారు.
తల్లి విజయమ్మని ‘గాంధారి’తో పోల్చుతూ సొంత మీడియాలో కధనం అచ్చేయించిన ఘనత జగన్కి మాత్రమే దక్కుతుంది. చెల్లెమ్మలు నేటికీ అన్నని క్షమించలేకపోయినా, కొడుకు చేత ‘గాంధారి’ అనిపించుకున్న విజయమ్మ మాత్రం ఓ తల్లిగా కొడుకుని క్షమించేసి, అతనికి మళ్ళీ పదవీ అధికారం దక్కాలని ఆ ప్రభువుని ప్రార్దిస్తూనే ఉన్నారు.
అందుకే అలాంటి ‘తల్లికి వందనం’ అని సిఎం చంద్రబాబు నాయుడు, ఆ ‘అమ్మ ఒడి’లోనే సేద తీరుతున్నానని కొడుకు జగన్ చెప్పుకుంటారు.




