ఏపీలో జనసేన, వైసీపీలు రెండూ చాలా భిన్నమైన ధోరణితో పనిచేస్తుంటాయి. ఉదాహరణకు వైసీపీ అధినేత జగన్ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి పదవి, అధికారం కోరుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మరో పదేళ్ళు పనిచేస్తానని చెపుతుంటారు.
కానీ రెండు పార్టీల శ్రేణులు వారి అధినేతలు గుమ్మం దాటి బయట కాలుపెడితే ఉత్సాహంగా వెంటసాగుతారు. అయితే వారి ఉత్సాహంలో కూడా తేడా ఉంటుంది.
వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ పోస్టర్లు ప్రదర్శిస్తూ అధికారంలోకి రాగానే ప్రత్యర్ధుల తలకాయలు నరికేస్తామని బెదిరిస్తుంటారు. కానీ జనసైనికులు, అభిమానులు ఆయన మాట్లాడితే వినాలని ఉవ్విళ్ళూరుతారు.
మా కార్యకర్తలు ఏదో సరదాకి రప్పారప్పా అంటే తప్పేమిటి?అని జగన్ ఎదురు ప్రశ్నిస్తే, మన వలన ప్రజలు ఇబ్బంది పడకూడదు. అందరూ మర్యాదగా, హుందాగా మేసులుకోవాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు హితవు చెపుతుంటారు.
పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తుంటారు కానీ నిజ జీవితంలో నటించరు. అందరితో మనసు విప్పి మాట్లాడుతుంటారు. జగన్, వైసీపీ నేతలు సినిమాలలో నటించరు. కానీ నిజజీవితంలో నిత్యం నటిస్తూనే ఉంటారు. సినిమా డైలాగులు చెపుతూనే ఉంటారు.
తాజాగా రైల్వే స్టేషన్ కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో వ్యవహారం వైరల్ అవడంతో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దాని విచారణ పూర్తిచేసి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
కానీ ఇలాంటి వీడియో వ్యవహారం బయటపడినప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని జగన్ వెనకేసుకువచ్చారు. వివేకా హత్య కేసులో నిందితులు మొదలు గంట, అరగంట, దువ్వాడ, విజయసాయి వంటి రాసలీలల వైసీపీ నేతలకు చాలా మంచివారని సర్టిఫికేట్ ఇస్తూ వారినే ఎన్నుకోమని ప్రజలను కోరారు.
వైసీపీ నేతలు ఘనమైన తమ ఈ హిస్టరీ, బ్యాక్ గ్రౌండ్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ మరిచిపోయి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతుండటం విశేషం.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి చాలా ఆలోచించింది. అతను వైసీపీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ నేటికీ వైసీపీ నేతలు అతనితోనే అంటకాగుతున్న సంగతి తెలిసిందే.
కానీ ఎవరు డిమాండ్ చేసినా చేయకపోయినా శ్రీధర్ ఈ హేయమైన పనికి పాల్పడినట్లు కమిటీ విచారణలో తేలితే తక్షణమే బహిష్కరణ వేటు వేయడం ఖాయం.
జనసేన, వైసీపీళ మద్య ఇలాంటి తేడాలు చాలానే ఉన్నాయి. కనుక ఈ వ్యవహారంలో వైసీపీ జనసేనని విమర్శించడం అంటే గురివింద గింజ నలుపెరుగదనే నానుడి గుర్తొస్తుంది.






