జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి, రాష్ట్ర పర్యటనల కోసం కోట్లు ఖర్చు పెట్టి సకల సదుపాయాలతో ప్రత్యేకంగా ఓ వాహనం తయారుచేయించుకొన్న సంగతి తెలిసిందే. దానికి ‘వారాహి’ అని నామకరణం చేసి ‘రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్’ అంటూ దాని ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాని ట్రయల్ రన్ వీడియోని కూడా అభిమానులకు షేర్ చేశారు. అయితే అది అచ్చం మిలటరీ వాహనంలాగే ఉండటమే కాకుండా దానికి మిలటరీ వాహనాలకు వేసే ఆలీవ్ గ్రీన్ కలర్ వేయడంపై సోషల్ మీడియాలో వైసీపీ అనుకూలవర్గం పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తోంది. “వారాహి ట్రయల్ రన్ వీడియో చాలా నాటకీయంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించినా సినిమా స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాలలో రాణించలేకపోతున్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడమే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు.
తన ప్రచార వాహనంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ అంతే ఘాటుగా స్పందించారు. “నేను ఏ రంగు దుస్తులు ధరించాలో, నా వాహనానికి ఏ రంగు వేయాలో, నేను ఎప్పుడు బయటకు రావాలో వద్దో అన్ని వైసీపీవాళ్ళే నిర్ణయిస్తారేమో? నా సినిమాలను అడ్డుకొంటున్నారు. నేను విశాఖలో పర్యటనకు వస్తే హోటల్ గదిలో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొని వెనక్కి తిప్పి పంపించేశారు. ఇప్పటం గ్రామంలో పర్యటించాలనుకొంటే అనుమతి లేదంటారు. కనీసం నడుచుకొని వెళ్తానాన్నా వారికి అభ్యంతరమే. చివరికి నేను శ్వాస తీసుకోవాలన్నా వైసీపీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటేరేమో?నన్ను, నా పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇటువంటి అనవసరమైన విషయాలపై రాద్దాంతం చేస్తున్నారని భావిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ తన అభిరుచి మేరకు వాహనానికి నచ్చిన రంగు వేయించుకొన్నారు. కనుక దానిని తప్పు పట్టడానికి లేదు. అయితే దాంతో ఆయన ప్రజల మద్యకు వస్తే తప్పుడు సంకేతాలే వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పవచ్చు. కనుక కంటికి ఇంపుగా ఉండే రంగునో లేదా జనసేన పార్టీ లోగోని లేదా పవన్ కళ్యాణ్ ప్రజలతో కలిసి దిగిన చిత్రాలను దాని చుట్టూ గీయించుకొంటే ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం పెరుగుతుంది కదా?



