రెండు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళడం సర్వసాధారణమైన విషయమే. పొత్తులో సీట్ల సర్దుబాట్లు ఎంత కీలకమో, వాటి మద్య బలమైన బంధం అంతకంటే ముఖ్యం. వాటి మద్య బలమైన బంధం, పరస్పర అవగాహన ఉందని ప్రజలు కూడా నమ్మిన్నప్పుడే ఆ కూటమికి ప్రజలు పట్టంగడుతుంటారు.
2014 ఎన్నికలలో ఇదే జరిగింది. టిడిపి, జనసేన, బీజేపీ మూడూ కలిసి పోటీ చేశాయి. జనసేన వాటికి పూర్తి మద్దతు ప్రకటించి, వాటి కోసమే పోటీకి దూరంగా ఉండిపోయింది. టిడిపి, బీజేపీలు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి కృషి చేస్తామనే నమ్మకం ప్రజలకు కలిగించాయి. అప్పుడే ఆ కూటమిపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగింది. ఎన్నికలలో గెలిచింది.
అయితే ఈసారి టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వాటిని వ్యతిరేకించేవారు, అనుమానాలు వ్యక్తం చేసేవారు, ఈసడించుకునేవారు, విచ్ఛిన్నం చేయాలనుకునేవారే ఎక్కువగా ఉండటంతో, రెండు పార్టీలు తొలి జాబితాలు ప్రకటించగానే పెద్ద విస్పోటనమే జరిగింది.
ఒకవేళ నిన్న జరిగిన జెండా సభలో పవన్ కళ్యాణ్ ఆ విస్పోటనాలను పట్టించుకోకుండా రొటీన్ ప్రసంగం చేసి ఉంటే, జనసేన పట్ల ప్రజలలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఇంకా చులకనభావం ఏర్పడి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను వివరిస్తూ, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏవిధంగా ప్రయత్నిస్తున్నారో విడమరిచి చెప్పారు. తాను ఏదో ఆషామాషీగా రాజకీయాలు చేయడం లేదని స్పష్టంగా చెప్పారు. సీట్ల సర్దుబాట్లలో తాను ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందో కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. సలహాలు ఇచ్చేవారు కాదు తన వెంట నడిచేవారే తనకు ముఖ్యమని తేల్చిచెప్పేశారు. ఎవరినీ నొప్పించకూడదనుకునే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఇంత సూటిగా చెప్పడం అందరికీ పెద్ద షాకే. పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పిన వెంటనే ఇద్దరు ప్రముఖ కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యల రియాక్షన్స్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా అందరూ పవన్ కళ్యాణ్న్ని గట్టిగా వెనకేసుకువచ్చారు. జనసేన రాజకీయ ఎదుగుదలకి పవన్ కళ్యాణ్ సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారని చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి నేతలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది టిడిపి, జనసేనల మద్య బంధం ఎంత బలంగా ఉందో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేసింది. కనుక ఇదేవిదంగా రెండు పార్టీలు పరస్పర నమ్మకం, స్నేహంతో ముందుకు సాగితే ఎన్నికలలో టిడిపి, జనసేనల మద్య ఓట్ల బదిలీ తప్పకుండా జరుగుతుంది. రెండు పార్టీలు తప్పకుండా ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తాయి కూడా.
టిడిపి, జనసేనలు జెండా సభతో తమ పొత్తుని మరింత బలపరుచుకొని ఈ విషయాన్ని ప్రజలకు, వైసీపికి, గోడ మీద పిల్లిలా కూర్చొని చూస్తున్న బీజేపీకి కూడా చాటి చెప్పాయి. కనుక ఇప్పుడు వైసీపి ఏవిదంగా స్పందిస్తుందో అందరికీ తెలుసు. కానీ బీజేపీ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.




