జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల ట్రెండ్ ను బయట పెట్టబోతున్నాయా.? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నిక ఇటు అధికార కాంగ్రెస్ కు ‘శీల’ పరీక్ష కాగా అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ‘బల’పరీక్ష వంటిది. అలాగే బీజేపీ కి బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత కు ఈ ఎన్నిక అగ్ని పరీక్ష వంటిది.
ఇప్పటికే బిఆర్ఎస్ మాగంటి గోపినాధ్ సతీమణి మాగంటి సునీత ను తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా ఇక కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే అధిష్టాన ఆమోద ముద్ర కోసం నిరీక్షిస్తుంది. అలాగే బీజేపీ సైతం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం అంతర్గత విభేదాలతో అల్లాడుతోంది.
ఇక కవిత ఈ ఎన్నిక ఫలితాల ఆధారంగా తన భవిష్యత్ రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ఉపఎన్నికలు ముఖ్యంగా కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించడంతో పాటు బిఆర్ఎస్ భవిష్యత్ ని కేసీఆర్ బలాన్ని నిర్దేశిస్తుంది.
బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాధ్ మరణం తో ఏర్పడిన ఉప ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలలో గెలుపు బిఆర్ఎస్ కు ప్రాణం పోస్తుంది, లేదంటే బిఆర్ఎస్ ప్రాణం తీస్తుంది. కావున బిఆర్ఎస్ కు ఈ ఉపఎన్నిక జీవన్మరణ సమస్యగా మారబోతుంది.
సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతవరకు ప్రజా క్షేతరంలోకి అడుగు పెట్టలేదు. బిఆర్ఎస్ చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా చివరికి కన్న కూతురే బిఆర్ఎస్ ఉంటే ఎంత పొతే ఎంత.? అంటూ పార్టీ ఉనికినే కించపరిచే స్థాయికి వెళ్లినా కేసీఆర్ మాత్రం తన గళం విప్పలేదు, పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వలేదు.
నాటి నుంచి నేటి వరకు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీని తన నాయకేతవరంలో నడిపిస్తున్న కేటీఆర్ ఇప్పటి వరకు కవిత వివాదం పై ప్రత్యక్షంగా స్పందించలేదు. అయితే ఈ ఉపఎన్నికలో పార్టీని ఓటమి నుంచి తప్పించి అటు అధికార పార్టీకి బిఆర్ఎస్ బలం తెలపాలి, అలాగే కవిత చర్యలు తప్పటడుగులే అని రుజువు చెయ్యాలి.
పోటీలో ఉన్నది మాగంటి సునీత అయినా ఆ గెలుపు కేసీఆర్ ది అవుతుంది లేదా బిఆర్ఎస్ కు వస్తుంది. అలాగే పార్టీ ఓడిపోయినా అది కేసీఆర్ ఓటమే అవుతుంది బిఆర్ఎస్ పతనం కిందకే వస్తుంది. కాబట్టి ఈ ఉపఎన్నికలు బిఆర్ఎస్ కు జీవన్మరన సమస్యగానే భావించాల్సి ఉంటుంది.






