ఈ నెల 25న కల్వకుంట్ల కవిత అట్టహాసంగా తన పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఇంగ్లీషులో ‘టీఆర్ఎస్ పార్టీ’ అని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ‘టీఆర్ఎస్’కి ఆమోదం తెలిపింది. కానీ ‘రాష్ట్ర సేన’కి బదులు ‘రక్షణ సేన’ అనే పేరుతో ఆమోదం తెలిపింది. కనుక దానినే స్వీకరించక తప్పలేదు.
భారీ సభ ఏర్పాటు చేసి దానిలో పార్టీ పేరు ప్రకటించిన తర్వాత పేరులో ఇటువంటి చిన్న మార్పు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ పార్టీ పేరు ఇంకా పూర్తిగా ప్రజలలోకి వెళ్ళి ఉండదు. ప్రజలకు సంబంధించినంతవరకు అది ‘టీఆర్ఎస్ పార్టీ.’ కనుక ఈ మార్పుతో పెద్దగా తేడా ఉండదు.
కానీ ‘రక్షణ సేన’ చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో రక్షణ సేన ఎక్కడ హడావుడి చేసినా ప్రత్యర్ధులు సరిగ్గా ‘రాక్షస సేన’ అంటూ విమర్శించకుండా ఉండరు. ఇది కూడా కల్వకుంట్ల కవితకు, ఆమె పార్టీ శ్రేణులకు ఇబ్బందికరమైన విషయమే అవుతుంది.
పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేశారు… వాటికి ఈసీ ఆమోదముద్ర కూడా వేసింది. కనుక ఇప్పుడు భవిష్య కార్యాచరణపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
కవిత చెప్పిన్నట్లు కేవలం ప్రజా సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాడితే సరిపోదు. పదవీ అధికారం కూడా కావాలి. కానీ దానికి మరో రెండున్నరేళ్ళు సమయం ఉంది. కనుక ఆలోగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను, కార్యకర్తలని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశాలలో గోత్రనామాలు చెప్పుకొని తమ పరిచయం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి వారిని మీడియా కూడా పట్టించుకోదు. ఇక వారు చేసే విమర్శలు, ఆరోపణలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసలే పట్టించుకోరు.
కనుక వారికి సమ ఉజ్జీలను ఆ రెండు పార్టీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కల్వకుంట్ల కవిత ఫస్ట్ టాస్క్ ఇదే.
బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది తనతో టచ్లో ఉన్నారని, అ పార్టీ శ్రేణులు తన వెంటే ఉన్నారని ఇదివరకే కల్వకుంట్ల కవిత చెప్పుకున్నారు. అవి నిజమేనని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది.




