తెలంగాణలో నేతలు తిట్టుకొంటే వైసీపి నేతలకు ఉక్రోషం… దేనికి?

Karumuri Venkata Nageswara Rao

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తెలంగాణలో ఎన్నికలు ఏపీలో వైసీపి ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. అక్కడ రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకొంటుంటే ఇక్కడ వైసీపి నేతలకు ఉక్రోషం వచ్చేస్తోంది.
తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసిందో చెప్పుకోవడానికి కేసీఆర్‌తో సహా తెలంగాణ మంత్రులు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులతో పోల్చి చూపిస్తుండటమే ఇందుకు కారణం.

డబుల్ రోడ్ ఉంటే అది తెలంగాణ రాష్ట్రమని, ఎక్కడైతే సింగిల్ రోడ్ మొదలవుతుందో అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మొదలవుతుందంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు భగ్గుమంటున్నారు.మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ, “కరోనా సమయంలో కేసీఆర్‌ ఫామ్‌హౌసులో పడుకొంటే, ఇక్కడ మేము రేయింబవళ్ళు కష్టపడుతూ కరోనాను కట్టడి చేశాము. తెలంగాణలో పిల్లలు కాలువలలో పడి కొట్టుకుపోతుంటారు. పాఠశాలలో విషాహారం తిని తరచూ ఆసుపత్రుల పాలవుతుంటారు. అదే… ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దులకు నాణ్యమైన ఆహారం పెడుతూ, అంతర్జాతీయస్థాయిలో విద్యను అందిస్తున్నాము.

ADVERTISEMENT

తెలంగాణకు హైదరాబాద్‌ దక్కింది కానీ మాకు రాజధానే లేదు. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నాము. మీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే మీ రాష్ట్రం, మీ పార్టీ గురించి చెప్పుకోండి. కానీ చిటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెనకబడిపోయింది. దయనీయ పరిస్థితిలో ఉందని ప్రజలకు అబద్దాలు చెప్పి నమ్మించాలనుకోవడం సరికాదు. అయినా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్: 1 చేసేశామని చెప్పుకొంటున్నారు కదా? ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు వాడుకొంటున్నారు?” అని ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, “ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలలో ఉన్న తెలంగాణ గ్రామాలలో ప్రజలు, ఏపీ గ్రామాలలో అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి, తమకు అటువంటి పధకాలు లభించడం లేదని, కనుక తమ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పధకాలతో ఈ నాలుగున్నరేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం గణనీయంగా తగ్గిపోయింది,” అని గర్వంగా చెప్పుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇంత గొప్పగా ఉంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏపీని వేలెత్తి ఎందుకు చూపిస్తున్నాయి?రాష్ట్రం నుంచి నిరుద్యోగ యువత డిగ్రీలు పట్టుకొని హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు ఎందుకు వలసలు పోతున్నారు? ఏపీలో పేదరికం లేకపోతే ఇంకా సంక్షేమ పధకాలను ఎందుకు కొనసాగిస్తోంది?ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలే చెల్లించలేకపోతున్నప్పుడు ధాన్యం కొనుగోలు చేసి రైతులందరికీ డబ్బు చెల్లించేసిందంటే నమ్మశఖ్యంగా ఉందా?మంత్రులే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories