లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానన్నట్లు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో కాస్త లేటుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ చాలా చురుకుగానే దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో అన్న కేటీఆర్ కంటే చాలా సమర్ధంగా, చురుకుగా స్పందిస్తున్నారు.
ఉదాహరణకు మూసీ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇళ్ళు కూల్చేయబోతే కేటీఆర్ తన పార్టీ నేతలను వెంటబెట్టుకొని హడావుడి చేసి వెళ్ళిపోయారు.
అది కేవలం మీడియాలో ప్రచారం కోసమే తప్ప నిర్వాసితులను ఆదుకోవడం కోసం కాదని సిఎం రేవంత్ రెడ్డి తేలికగా తీసి పడేశారు. వారిని ప్రభుత్వమే ఆదుకుంటుందని కూడా హామీ ఇచ్చారు.
కానీ కల్వకుంట్ల కవిత కూడా ఇదే అంశంపై చేసిన పోరాటం భిన్నంగా ఉంది. ఆమె తన అనుచరులతో కలిసి బఫర్ జోన్లో నిర్మిస్తున్న ఓ భారీ ప్రాజెక్టు ఎదుట బైటాయించి ధర్నా చేశారు.
“బడాబాబులకు చెరువులో వెంచర్లు వేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఎలా అనుమతిస్తోంది? వాళ్ళని అనుమతిస్తూ పేదల ఇళ్ళు ఎందుకు కూల్చేస్తోంది?” అంటూ నిలదీశారు. ఆమె ధర్నా.. దానికి ఎంచుకున్న ప్రదేశం, ఆమె ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
ఇదేవిధంగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ప్రభుత్వం పేదల ఇళ్ళు కూల్చివేయగానే ముందుగా కేటీఆర్ అక్కడకు వెళ్ళి ఖండించేసి చేతులు దులుపుకున్నారు.
కానీ కవిత కాస్త ఆలస్యంగా వెళ్ళినా అక్కడ నిరాహారదీక్ష చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ప్రభుత్వం నిర్వాసితులకు అక్కడే ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఇది కవిత తొలి విజయంగా చెప్పవచ్చు.
జాగృతి సోషల్ మీడియా అనుచరులు ఈ తేడాని ప్రస్తావిస్తూ, కేటీఆర్ ‘జస్ట్ కంటెంట్ క్రియేటర్’ అంతే! ఆయన కవితలా కష్టపదలేరు.. పోరాడలేరు,” అంటూ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి, జాగృతి అనుచరులు చేసిన ఈ రెండు కామెంట్స్ గమనిస్తే, కేటీఆర్ ఇది వరకులా కష్టపడలేకపోతున్నారని అర్ధమవుతుంది.
ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మద్యనే ఉంటారు. కానీ 30 ఏళ్ళు రాష్ట్రాలను ఏలాలని పగటి కలలుకంటున్న ‘యువ నాయకులు’ జగన్, కేటీఆర్ బయట తిరగలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు తిరిగితే చాలనుకుంటున్నట్లున్నారు. అందుకే ఇద్దరూ ‘కంటెంట్ క్రియేటర్స్’గా మిగిలిపోతున్నారు.




