సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై కత్తులు నూరడం మొదలుపెట్టిన్నప్పటి నుంచి టిఆర్ఎస్ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని, అక్కడి ప్రజలు దయనీయ పరిస్థితులు అనుభవిస్తున్నారని కనుక ఈసారి గుజరాత్లో బిజెపికి ఓటమి తప్పదంటూ పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తోంది. కానీ కేసీఆర్ అంచనాలు, ఆయన మనసాక్షి పత్రిక నమస్తే తెలంగాణ అంచనాలని తారుమారు చేస్తూ గుజరాత్లో బిజెపి గతంలో కంటే భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.
గుజరాత్లో మొత్తం 182 శాసనసభ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బిజెపి 25 స్థానాలలో విజయం సాధించి మరో 129 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. అంటే ఈసారి మరింత మెజార్టీతో గుజరాత్లో బిజెపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రాబోతోందన్నమాట!
జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న కేసీఆర్కి ఈ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించేవే అని చెప్పక తప్పదు. బిజెపికి కంచుకోటగా చెప్పుకోబడే గుజరాత్లో ఒకవేళ ఓడిపోయుంటే ఆయన, నమస్తే తెలంగాణ వాదనలు నిజమని నమ్మకం కలిగి ఉండేది. పైగా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి చాలా సానుకూల వాతావరణం ఏర్పడి ఉండేది. కానీ ఈ ఫలితాలు ఆయనకి పెద్ద షాక్ అని చెప్పక తప్పదు.
ఇక హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 68 స్థానాలు ఉండగాప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని 8 స్థానాలలో గెలిచి మరో 29 స్థానాలలో ఆదిక్యంలో కొనసాగుతోంది. కనుక ఆ రాష్ట్రం బిజెపి చేతిలో నుంచి జారిపోయి హస్తగతం కాబోతోంది.
అయితే సిఎం కేసీఆర్ బిజెపిని ప్రధాన శత్రువుగా భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని కూడా సమాన దూరంలో పెట్టాలని భావిస్తున్నారు కనుక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుతో ఆయనకి ఒరిగేదేమీ లేదు కానీ బిజెపి ఓడిపోయిందనే సంతోషం మాత్రం మిగలవచ్చు.
ఇక బిజెపికి గుజరాత్లో అధికారం నిలబెట్టుకోవడమే చాలా కీలకం. అది సాధించింది కనుక ఆ ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో జోరు పెంచడం ఖాయం. ఇది కేసీఆర్కి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కనుక కేసీఆర్ ఓవైపు తన టిఆర్ఎస్ నేతలు చేజారిపోకుండా కాపాడుకొంటూనే బిజెపిని ధీటుగా ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశంపై మళ్ళీ పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు.




