ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందని అన్ని సర్వేలు ముక్త కంఠంతో చెప్పేశాయి. దీంతో బిఆర్ఎస్ నేతలు, అభ్యర్ధులు, పార్టీ కార్యకర్తలు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే సిఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము. ఈ సర్వేలను చూసి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ ధైర్యం చెప్పారు. మరో అడుగు ముందుకు వేసి, ఫలితాలు వెలువడిన మర్నాడు అంటే డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన కూడా చేసింది.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు సూచిస్తున్నప్పుడు కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి సిద్దమవడం పార్టీ గెలుస్తుందనే ఆత్మవిశ్వాసమా లేక అతివిశ్వాసమా? అనే చర్చ మొదలైంది. లేదా మళ్ళీ తానే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నంటూ పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించడానికి అయ్యుండవచ్చు లేదా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటి నుంచే ఆకర్షించడానికి కావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 60 సీట్లు అవసరం. కానీ తాము 70-75 సీట్లు గెలుచుకొని మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెపుతున్నారు. అప్పుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కానీ ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలేకపోతే?మంత్రివర్గ సమావేశం ఎలా ఏర్పాటు చేయగలదు?అంటే బిఆర్ఎస్ పార్టీ 45-50 సీట్లే గెలుచుకొన్నా, మజ్లీస్ పార్టీ 7 సీట్లతో ఎలాగూ మద్దతు ఇస్తుంది. కనుక కాంగ్రెస్ లేదా బీజేపీలకు చెందిన మరో 10 మ్మెల్యేలను ఆకర్షించగలిగితే చాలు. కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు. ముఖ్యమంత్రి కాగలరు.
బహుశః ఇందుకే కాంగ్రెస్ పార్టీ భయపడి తన గెలుపు గుర్రాలను బెంగళూరుకి తరలించబోతోంది. ఈ ఎన్నికలలో బీజేపీ 4-5 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సహకరిస్తుందా?డిసెంబర్ 3న ఫలితాలు వెలువడిన తర్వాత మూడు పార్టీల పవర్ ప్లే మొదలవుతుంది అది చూసి తీరాల్సిందే.





