తెలంగాణకు అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం దక్కడమే కాకుండా, రాష్ట్రాన్ని, రాజధానిని కూడా అభివృద్ధి చేసుకోవాలని పరితపించే కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టమే.
కానీ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. అటువంటి పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఒకవేళ ఆనాడు ఆయన తడబడి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. ఆ పరిస్థితులలో కూడా ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించేవారు.
రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఓ దివ్యమైన రాజధాని ఉండాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించేందుకు పూనుకొన్నారు. ఆయన పట్టుదల, నిబద్దత, దూరదృష్టి గురించి కేసీఆర్కు బాగా తెలుసు.
ఒకవేళ అమరావతి నిర్మిస్తే, తెలంగాణ నష్టపోతుందని కేసీఆర్ గ్రహించారు. అందుకే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడాలనుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా తోడ్పడ్డారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఊహించిన్నట్లే జగన్ అమరావతిని పాడుపెట్టేశారు. మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేయలేదు.
రాష్ట్రాభివృద్ధి కంటే వైసీపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించి సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగులు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వలసలు పోతున్నారు. చివరికి జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోంది.
అమరావతిని అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి నిలిచిపోయేలా చేసిన కేసీఆర్ మాత్రం ఈ పదేళ్ళలో రేయింబవళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అందరూ పోల్చి చూస్తుండటం పరిపాటి అయ్యింది.
ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అక్కడి పార్టీలు, ప్రజలే కాదు తెలంగాణ మంత్రులు సైతం తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకొనేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను ఉదాహరణగా చూపిస్తుంటారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా అదే చేశారు. “మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లాగ, హైదరాబాద్ నగరం అమరావతిలా దివాళా అయిపోతాయని” అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన అన్న మాటలు చాలా బాధ కలిగిస్తాయి కానీ అది వాస్తవమే అని అందరికీ తెలుసు. కానీ ఏపీకి ఈ దుస్థితి కల్పించింది కేసీఆరే కదా?అందుకు బిఆర్ఎస్ నేతలు ఏ మాత్రం సిగ్గుపడకపోగా తమ వలన చితికిపోయిన ఏపీని తెలంగాణ ప్రజలకు చూపిస్తూ ‘మన రాష్ట్రం అలా కాకూదంటే కేసీఆర్ని గెలిపించాలని’ కోరుతున్నారు కూడా. అయినా మన బంగారం మంచిది కానప్పుడు ఎవరిని అని ఏం లాభం?





