నేటికీ రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కారం కాకుండా పేచీలు పెడుతున్న కేసీఆర్కి హటాత్తుగా ఆంధ్రప్రదేశ్పై ప్రేమ పొంగుకొచ్చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దానిలో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులను కాపాడేయాలని నిర్ణయించుకొని, ప్లాంట్లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడుతున్నారు. అయితే దీని వెనుక తమకు ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేవని తెలంగాణ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు.
మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ దేశ సంపదను, సహజవనరులను, చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ గుజరాత్లోని తన ఇద్దరు దోస్తులకు (అంబానీ, ఆదానీ) దోచిపెడుతున్నారు. ఛత్తీస్ఘడ్లోని బైలాదిలా గనులను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆదానీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బైలాదీల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుము సరఫరా చేయవచ్చు. అలాగే ఇక్కడ బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి దానికీ సరఫరా చేయవచ్చు. కానీ 1800 కిమీ దూరంలో ఉన్న గుజరాత్లోని ముంద్రాకు తరలించుకుపోతున్నారు!
ఈ రెండూ ఆదానీ చేతికి వెళ్ళిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోతాయి. అందుకే మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెట్టి రెంటినీ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి ఏవిదంగా ఉందనేది మాకు అనవసరం. మా బృందం నివేదిక ఆధారంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టడంపై నిర్ణయం తీసుకొంటాము. దీని వెనుక మాకు ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేవు,” అని చెప్పారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మాట తప్పి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుందని నాలుగేళ్ళ క్రితం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత దానిని పట్టించుకోలేదు! తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వెనకాడిన కేసీఆర్, ఇప్పుడు ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చెపుతుండటం ఆశ్చర్యకరమే కదా?
కేసీఆర్ చేతిలోనే సింగరేణి బొగ్గు గనులున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం వేలకోట్లు పెట్టుబడి పెట్టగల సామర్ధ్యం కూడా ఉందని ఇప్పుడు స్పష్టం అయ్యింది. కనుక అదేదో తెలంగాణలోనే పెట్టుకోవచ్చు కదా? కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే ఎందుకు?అంటే ఆ పేరు చెప్పుకొని ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించుకోవడానికే అని చెప్పవచ్చు.
బహుశః వైసీపీ-బిఆర్ఎస్ పార్టీలు రహస్య అవగాహనతోనే ఇది చేస్తున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకొని, మూడు రాజధానుల పాట పాడుతున్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించి అమరావతి నిర్మాణం నిలిచిపోయేలా చేసారు కేసీఆర్.
టిడిపిని అధికారంలోకి రాకుండా అడ్డుకొని ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడితే, ఏపీ ఇలాగే అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోతుంది. అప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంటుంది.
మరో బలమైన కారణం ఏమిటంటే, తెలంగాణలో కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటితో కేసీఆర్ ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు. కనుక ఈవిదంగా తనతో కలిసి వచ్చేవారికి తోడ్పడుతూ, వారందరి సహకారంతో తన ప్రధాన మంత్రి కల నెరవేర్చుకోగలుగుతారు. అంటే మోడీ బాటలోనే కేసీఆర్ కూడా ప్రయాణిస్తున్నారనుకోవచ్చు కదా?



