దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందిస్తున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం మౌనం వహిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో కొన్నిసార్లు ‘సైలంట్ మోడ్’లో ఉండిపోవడం కూడా ఓ వ్యూహమే అని చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలోనే కేసీఆర్, కేటీఆర్ నిరూపించారు.
అయితే ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నది అసమదీయులే కదా? అయినా వేల పుస్తకాలు చదివి, వందల యాగాలు చేసిన కేసీఆర్ ఈ అంశంపై కూడా మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్ అనేక యజ్ఞయాగాలు చేస్తుంటారు. నేటికీ చేస్తూనే ఉన్నారు.
తిరుమలకి పోటీగా యాదాద్రిని పునర్నిర్మించి అభివృద్ధి చేశారు. కేసీఆర్ కంటే గొప్ప ఆద్యాత్మికవాది, హిందువు ఎవరున్నారని కేటీఆర్ అడుగుతుంటారు. అంత శ్రీ మహా భక్తుడైన కేసీఆర్ కూడా తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై స్పందించలేదు!
విరాటపర్వంలో పాండవులు తమని ఎవరూ గుర్తించకుండా మారువేషాలలో ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసిన్నట్లుగా, కేసీఆర్ కూడా గత నాలుగైదు నెలలుగా తన ఫామ్హౌస్లో అజ్ఞాతవాసం చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కనుక ఇప్పుడు తిరుమల స్వామివారి కోసమైనా సరే… ఆయన వ్రతభంగం చేయలేరని సర్ధి చెప్పుకోవచ్చు.
కానీ వైఎస్ షర్మిల తర్వాత జగన్మోహన్ రెడ్డిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలిచిన తమ్ముడు కేటీఆర్ కూడా ముందుకు రాకపోవడం, కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం వస్తుందన్నట్లు, సున్నితమైన ఈ అంశంలో జగన్ కోసం ఆరాటపడి మాట్లాడితే తెలంగాణలో హిందూ ఓటు బ్యాంకు గల్లంతు అవుతుందనే ఆలోచనతోనే తమ్ముడు కేటీఆర్ కూడా మౌనం వహిస్తున్నారేమో?
అయితే తిరుమల శ్రీవారి విషయంలో అపచారం జరిగినప్పుడు కూడా రాజకీయ లెక్కలు చూసుకొని మౌనంగా ఉండిపోతే ఈ యజ్ఞాలు, యాగాలు, పూజలు, దేవాలయాల నిర్మాణం చేసి ఏం ప్రయోజనం?




