కార్తీక మాసం మొదలుకుని దాదాపు నాలుగు నెలల పాటు సాగే అయ్యప్ప స్వామి దివ్యదర్శనం కోసం ఏటా లక్షలాది భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయితే శబరిమలకు చేరుకోవాలంటే, పంబ నుండి దాదాపు 7 కిలోమీటర్ల వరకు కాలినడకను పయనించాల్సిందే. ఇలా నడవలేని వ్యక్తులను, జోలి పట్టుకుని ఓ ఇద్దరు వ్యక్తులు శబరిమల వరకు మోసుకునే వెళ్ళే సదుపాయం ఉంది. ఇక, కేరళలోని వివిధ ప్రాంతాల వరకు రైలు మార్గం ఉండగా, అక్కడ నుండి పంబ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంది. దీనికి మించి మరో ప్రత్యామ్నాయం అయితే లేదు.
అయితే ఈ వసతులు కొందరు భక్తులకు ఇబ్బందికరంగానే ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడేవారు, ఏటవాలుగా ఉండే ఆ కొండను ఎక్కడానికి భయపడుతుంటారు. ఆ చిన్ముద్రుని రూపంలో ఉన్న మణికంఠ స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇది కొంత అవరోధంగానే భావించవచ్చు. అయితే కేరళ మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది భక్తులకు తీపి వార్త లభించినట్లయ్యింది. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు కేరళ మంత్రి వర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది.
ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్లో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. జీవితంలో ఒక్కసారైనా శబరిమలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ నిర్ణయం ఖచ్చితంగా ఊరటనిచ్చే అంశం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఏ ఏ ప్రాంతాల నుండి ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తారనేది కీలకంగా మారింది.



