మాజీ మంత్రి, నారాయణా గ్రూప్ విద్యాసంస్థల అధినేతను ఏపీ సీఐడీ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేయడంపై ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు చాలా ఘాటుగా స్పందించారు.
ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ తాజా ప్రకటనలో,” మాజీ మంత్రి నారాయణ అరెస్టును నేను ఖండిస్తున్నాను. సిఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్ధ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ సాకుతో నారాయణను అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నాను. అసలు ఆయనను అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఆయనపై ఏమేమి కేసులు పెట్టారో చెప్పకూడానే అరెస్ట్ చేశారు. ఇది సిఎం జగన్ అప్రజాస్వామిక పాలనకు ఓ నిదర్శనం.
ఈ మూడేళ్ళలో జగన్ ప్రభుత్వం ఏమి చేసిందంటే ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు, అరెస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని చెప్పారు కదా? కానీ అదే కారణంతో నారాయణను అరెస్ట్ చేశారంటే రాజకీయ కక్ష సాధింపే కదా?
తన ప్రభుత్వం, పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలలో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని గుర్తిచి సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు,” అని ఆరోపించారు.
—



