అన్ని రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు అధికార పీఠమే అంతిమ లక్ష్యం. దాని కోసం ఎన్ని వ్యూహాలైన వేస్తారు, ఎన్ని పొత్తులైన కుదుర్చుకుంటారు, అలాగే ఎన్ని కిలోమీటర్లయినా పాదయాత్ర చేస్తారు.
తెలుగు రాష్ట్రాలలో ‘పాదయాత్ర’ అంటే అది ‘పదవి యాత్రే’ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. దీనికి మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి బాటలు వేశారు. వీరిద్దరూ కూడా వారి పార్టీలు రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న సమయంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
అలాగే తండ్రి రాజకీయ వారసత్వాన్ని హక్కుగా తీసుకున్న వైస్ జగన్ తన మొదటి ప్రయత్నంతో ప్రజల మద్దతు దక్కించుకోకపోవడంతో, ఇక పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజలకు చేరువ కావడానికి తన తండ్రి పునాది వేసిన పాదయాత్రనే నమ్ముకున్నారు, దానితో ప్రజలను నమ్మించగలిగారు, అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు.
ఇక 2019 ఎన్నికల అనంతరం ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ, టీడీపీ పార్టీని రాజకీయంగా కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురి చేసింది. దీనితో అటు వైసీపీ నిరంకుశత్వాన్ని ప్రజలలో ఎండగడతానికి, టీడీపీ పార్టీ కార్యకర్తలు మనో ధైర్యాన్ని అందించడానికి లోకేష్ ‘యువగళం’ పేరుతో తండ్రి వేసిన బాటలో పాదయాత్రకు నడుంబిగించారు.
అలాగే దాని ఫలితంతో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పాటుగా లోకేష్ ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. దీని బట్టి రాజకీయ పార్టీల నాయకులకు పాదయాత్ర అనేది పదవికి, అధికారానికి ఒక దివ్యౌషధంలా మారిపోయింది. అయితే ఇంతటి ఉపోద్ఘాతం వెనుక మరో రాజకీయ నాయకుడి పాదయాత్రకు రంగం సిద్ధం అయ్యింది.
తాజాగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ అధికారంతో పాటే ఆ పార్టీ నాయకత్వాన్ని కోల్పోయింది. పదేళ్ల అధికారం చేజారిపోవడంతో ఆపార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా అధికార పార్టీ కండువాలు కప్పుకుని తమ రాజకీయ జీవితానికి భద్రత ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నైతికంగా చాల బలహీనపడింది. పార్టీ కింద స్థాయి నాయకులలో కూడా తీవ్ర ఆందోళన మొదలయ్యింది.
దీనితో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు ప్రణాళిక జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు అవసరమైతే భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, తన X లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో ఈసారి బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ పాదయాత్ర ఉపిరిపోయనుందా.? అంటూ ఈ పోస్ట్ పై కామెంట్స్ మొదలయ్యాయి.
ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీని 2029 లో తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు నాకు ఇంకా వయసు ఉంది, పాదయాత్ర చేసే సత్తువ నా కాళ్ళల్లో ఉంది, పార్టీ శ్రేణులెవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదు అంటూ వైస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు త్వరలోనే మరో పాదయాత్రకు సిద్ధంగా ఉండాలి అంటూ పరోక్ష సందేశాన్ని అందించారు.
మొన్న రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికారానికి దూరమైన ఈ ఆత్మ మిత్రులిద్దరూ కేటీఆర్, జగన్ పాదయాత్రలతో తిరిగి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పోగొట్టుకున్న పీఠాన్ని తిరిగి పొందగలుగుతారా.? పాదయాత్ర రాజకీయ నాయకులకు పదవి యాత్రే అని మరోసారి నిరూపించగలుగుతారా.? అనేది కాలమే బదులివ్వాలి.




