విజయవాడ వరద బాధితుల సహాయార్ధం వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ చెక్కుని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి ఉండి ఉంటే అందరూ మెచ్చుకొని ఉండేవారు.
కానీ వైసీపి ద్వారా దానిని వరద బాధితులకు అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఓ రెండు మూడు రోజులు వరద బాధితులకు పాలు, నీళ్ళ ప్యాకెట్లు, కొన్ని చోట్ల నిత్యావసర సరుకులు అందిస్తూ వైసీపి నేతలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు నిర్విరామంగా చేసిన సహాయపునరావాస చర్యలతో విజయవాడ వరద బాధితులు చాలా త్వరగానే కోలుకొని మళ్ళీ రోజువారీ జీవితాలు ప్రారంభించారు. బహుశః అందుకేనేమో వైసీపి నేతలు కూడా ఇంకా డబ్బు ఖర్చు చేయడం దేనికని వరద బాధితులకు పంపిణీ నిలిపివేశారు. కనుక జగన్ ప్రకటించిన కోటి రూపాయలలో ఎంత ఖర్చు చేశారో, ఎంత మిగిలిందో వారికే తెలియాలి.
కానీ ఆంధ్రా నుంచి హైదరాబాద్ వలస వెళ్ళి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతుకు బండి నడిపిస్తున్న కుమారీ ఆంటీ మాత్రం నిన్న అమరవతికి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50,000 విరాళం చెక్కు అందజేశారు. ఆమెకు సిఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు ఆమె తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50,000 విరాళం చెక్కు అందజేశారు. జగన్ ప్రకటించిన కోటి రూపాయలు కంటికి కనపడలేదు. కుమారీ ఆంటీ రెండు రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన లక్ష రూపాయలు విరాళం మాత్రం స్పష్టంగా కనపడింది.




