విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ జనాలు తలచినది ఒకటి… అక్కడ జరిగింది మరొకటి. తమ ప్రాంతాలకు చెందిన ఎంపీలందరూ ఎలాగైనా విభజనను అడ్డుకుంటారని భావించిన ప్రజలకు ఓ పెద్ద సినిమానే చూపించింది అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సరే… జరిగిందేదో జరిగింది… ఇక ఏపీ భవిష్యత్తుకు కీలక పరిణామంగా భావిస్తున్న ప్రత్యేక హోదాపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేయాలని చేస్తున్న ప్రయత్నాలను వరుసగా వాయిదా వేయడంలో, ప్రస్తుత కేంద్ర సర్కార్ విజయవంతమవుతోంది.
మళ్ళీ స్వార్ధ రాజకీయాన్ని ప్రదర్శించేందుకు గానూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని అంతా భావించారు, కానీ, దానిని సోమవారం నాటికి వాయిదా వేయగా, తాజాగా ఆగష్టు 5వ తేదీకి వాయిదా పడింది. అప్పుడైనా బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావిస్తే… మరోసారి భంగపాటుకు గురికాక తప్పదని భావించాలి. ఏపీకి ప్రయోజనకారి అయ్యే ఏ అంశమైనా వివక్షకు గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాలు నిరూపించుకుంటున్నాయి.
ఒక్కసారి నేటి పరిమాణాలను పరిశీలిస్తే… బీజేపీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేటి సమావేశంలో ఆందోళనకు దిగింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కేవీపీ బిల్లుపై ఓటింగ్ ను వాయిదా వేసేలా చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ… తక్షణమే బిల్లుపై చర్చకు అనుమతించాలని చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ ను కోరారు. అయితే సభలో కాంగ్రెస్ వాదనను తిప్పికొట్టేందుకు బీజేపీ యత్నించడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ సందర్భంగా ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు యత్నించిన కురియన్ ఓ కీలక ప్రకటన చేశారు. కేవీపీ ప్రతిపాదించిన బిల్లుపై ఈ శుక్రవారం కూడా ఓటింగ్ కు అనుమతించే ప్రసక్తే లేదని, సభా నియమాల ప్రకారం ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం అంటే ఆగష్టు 5వ తేదీన కేవీపీ బిల్లుపై ఓటింగ్ కు సిద్ధమని ప్రకటించారు. ఓటింగ్ వస్తే నిజంగానే ‘ప్రత్యేక హోదా’ వస్తుందన్న ఆశ ఏపీ జనాలకు లేదు గానీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు.



