శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెంపుకి ముహూర్తం ఖరారు!

India Parliament seat increase plan with Lok Sabha and Assembly expansion details

లోక్‌సభ మరియు దేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలు ఒకేసారి 50 శాతం పెరగబోతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 175 సీట్లు 263కి పెరుగుతాయి. అదేవిధంగా ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి.

ADVERTISEMENT

తెలంగాణ శాసనసభ 119 సీట్లు 179కి, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి ప్రస్తుతం 4,123 అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి 6,185కి పెరుగుతాయి. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543. అవి 816కి పెరుగుతాయి.

ఇదివరకు జనాభా ఆధారంగా లోక్‌సభ, శాసనసభ సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ఆ లెక్కన చేస్తే తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గి, ఉత్తరాది రాష్ట్రాలకు గణనీయంగా పెరుగుతుందని దక్షిణాది రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని అన్ని రాష్ట్రాలకు 50 శాతం చొప్పున సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ పెంపు కోసం, నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణలు చేసేందుకు ఈ సమావేశాలలో బిల్లులు ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమేన్తరే వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌ చరణ్‌ మేఘ్ వాల్ ముగ్గురూ కాంగ్రెసేతర పార్టీలతో మాట్లాడారు. నేడో రేపో వారు కాంగ్రెస్‌, మిత్ర పక్షాలతో కూడా సమావేశమై వారి అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు.

పార్లమెంటులో డీలిమిటేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించగానే కేంద్ర ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా ఓ కమీషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ, శాసనసభ స్థానాలు పెంచి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదిస్తే మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఆ మేరకు గణనీయంగా సీట్లు పెరుగుతాయి. 2029 ఎన్నికలలోనే వీటన్నిటినీ అమలుచేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ ప్లాన్ చేసుకుంటోందని తెలుస్తోంది.

దేశంలో ‘రాజకీయ నిరుద్యోగం’ కూడా నానాటికీ పెరిగిపోతోంది. కనుక అన్ని పార్టీలలో అసంతృప్తి సెగలు వస్తూనే ఉన్నాయి. కనుక రాజకీయ పార్టీలకు, రాజకీయ నిరుద్యోగులకు ఇది చాలా సంతోషకరమైన వార్తే!

దేశ జనాభా కూడా పెరిగింది కనుక అందుకు తగ్గట్లు చట్ట సభలలో ప్రజా ప్రాతినిధ్యం అవసరమే. కానీ ప్రజాప్రతినిధులు అంతే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories