ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి రెండే రెండు. ఒకటి కల్తీ నెయ్యి, రెండు వైసీపీ నేతల జైలు, బెయిలు స్టోరీలు. వీటిపై అధికార-ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వాదోపవాదాలతో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ మూలపడింది.
కూటమి ప్రభుత్వం వైసీపీ ఇస్తున్న ఇలాంటి పనికిమాలిన అజెండాతో కొట్టుకుపోతోందే తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చెప్పుకోవడం లేదు.
వాటి రాజకీయాలతో ఏపీకి, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. కనుక వాటి రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మూలపేట గ్రీన్ సిగ్నల్ ఫీల్డ్ పోర్టు గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. అలాంటి శ్రీకాకుళం ముఖ చిత్రమే సమూలంగా మార్చేయగలదు సంతబొమ్మాళి మండలంలో నిర్మిస్తున్న ఈ మూలపేట పోర్టు.
రూ.4,361 కోట్లు వ్యయంతో 1,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఏడాదికి 23.5 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతుల సామర్ధ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.
దేశ విదేశాల నుంచి వచ్చే భారీ ఓడలను సైతం ఈ పోర్టులో నిలిపి లోడింగ్ అన్ లోడింగ్ చేసేందుకు వీలుగా మూడు భారీ బెర్తులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండింటి నిర్మాణం పూర్తయింది. మూడవది ఏప్రిల్ నెలాఖరుకి పూర్తవుతుంది.
బెర్తుల వద్ద భారీ ఓడలు నిలిపేందుకు వీలుగా సముద్రంలో 15.5 మీటర్ల లోతు ఉండాలి. దీని కోసం సముద్రగర్భంలో నుంచి సుమారు 13.25 క్యూబిక్ మీటర్ల ఇసుక, మట్టి, రాళ్ళు వగైరా తవ్వి తీశారు. మరో ఒకటిన్నర క్యూబిక్ మీటర్లు తవ్విపోయాల్సి ఉంది.
ఓడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు, ముడి ఇనుము, ఇతర ఖనిజాలను మూలపేట పోర్టుకి తరలించేందుకు, అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల నుంచి వచ్చే బొగ్గు, ముడి సరుకులు దేశంలో వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు చెన్నై-హౌరా రైల్వే లైన్తో అనుసంధానం చేస్తూ కొత్తగా రైల్వేలైన్ నిర్మిస్తున్నారు.
అలాగే ఏపీలో వివిధ జిల్లాలు, తెలంగాణ, తమిళనాడు, అటు ఓడిశా, చత్తీస్ఘడ్,మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల హైవేలతో మూలపేట పోర్టుని అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మిస్తున్నారు. పోర్టు కార్యాలయం, కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్స్, కన్వేయర్ బెల్ట్, భారీ క్రేన్స్ వగైరా చకాచకా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పోర్టు నిర్మాణ పనుల ద్వారానే సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా పని లభించింది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు మొదలైతే మరో 10-15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.
పోర్టులో కార్యకలాపాలు మొదలైతే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, ట్రాన్స్ పోర్ట్, హోటల్ తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
మూలపేట పోర్టుకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామిక కారిడార్ కూడా నిర్మిస్తోంది. ఇది కూడా సిద్దమై పరిశ్రమలు వస్తే సుమారు 75,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
ఇటు శ్రీకాకుళం-విజయనగరం-వైజాగ్ మద్య భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో ఐటి కంపెనీలు, అటు శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, పారిశ్రామికవాడ అందుబాటులోకి వస్తే ఉత్తరాంద్ర జిల్లాల ముఖ చిత్రమే సమూలంగా మారిపోతుంది.
ఇది కదా అభివృద్ధి అంటే. దీని కోసమే కదా రాష్ట్ర ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నది?






