ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వం టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిందో లెక్కలేదు. అదే… టిడిపి, జనసేనలు పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేసినా పట్టించుకోరు. కనుక కేసులు ఎదుర్కొంటున్న టిడిపి, జనసేన నేతలు దుష్టులు, దుర్మార్గులన్నట్లు, వైసీపీ నేతలందరూ పూలు కడిగిన ముత్యాలన్నట్లు చలామణి అవుతున్నారు.
తొలిసారిగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు వైసీపీ నేతలపై కోర్టులో క్రిమినల్ కేసులు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కోర్డినేటర్ గుర్రంపాటి దేవదర్ రెడ్డిలపై మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేసినట్లు నారా లోకేష్ తరపు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్ట్లో నందమూరి ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. కానీ నారా లోకేష్ ఆమెను స్థిరాస్తులు, ఆర్ధికవిషయాలలో మోసం చేసినందునే ఆత్మహత్య చేసుకొన్నారంటూ గుర్రంపాటి దేవదర్ రెడ్డి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలను ఉద్దేశ్యించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిరువురి మాటలు, వ్రాతలకు సంబందించి పత్రికలలో, సోషల్ మీడియాలో వచ్చిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు కోటేశ్వరరావు తెలిపారు. సమాజంలో చాలా గౌరవ ప్రతిష్టలు కలిగిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాల గురించి అనుచితంగా మాట్లాడి వారి ప్రతిష్టకు భంగం కలిగించినదుకు ఇద్దరు వైసీపీ నేతలపై ఐపిసి సెక్షన్స్ 499,500 ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరినట్లు నారా లోకేష్ న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు.



