టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బుదవారం 61వ రోజున అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో ప్రవేశించారు. నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 789.9 కిమీ పాదయాత్ర చేశారు.
టిడిపి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఆయనతో కలిసి పాదయాత్ర చేసి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తమ కుటుంబంలో మూడు తరాలతో పయ్యావుల కేశవ్కు విడదీయరాని అనుబందం ఉందన్నారు. పయ్యావుల ఓ పెద్దన్నలాగ తనకు మార్గదర్శనం చేస్తున్నారని నారా లోకేష్ సవినయంగా ప్రజలకు తెలియజేసారు.
తన పాదయాత్రతో ఒరిగేదేమీలేదన్న వైసీపీ నేతలను ఉద్దేశ్యించి, “నేను 30 రోజులు పాదయాత్ర చేస్తే మీ జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. 60 రోజులు చేసేసరికి కాలు నొప్పి వచ్చేసింది. నేను 400 రోజులు పాదయాత్ర చేసేసరికి మీ జగనన్న, మీ పార్టీ పరిస్థితి ఏవిదంగా ఉంటుందో?” అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ కాలు నొప్పికి నారా లోకేష్ చెప్పిన కారణాలు విని ప్రజలు విరగబడి నవ్వుకొన్నారు. “ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ 4 సీట్లు ఓడిపోయిందని తెలియగానే తనకు సలహాలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిని కాలితో ఒక్క తన్ను తన్నారు. అందుకే కాలు నొప్పి వచ్చి ఉండవచ్చు. లేదా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిందని తెలిసి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెళ్ళి ఓ ఎమ్మెల్యే ఫామ్హౌస్లో పార్టీ చేసుకొన్నారట. ఆ కోపంతో కాఫీ టేబిల్ని గట్టిగా తంతే కాలునొప్పి వచ్చి ఉండవచ్చు,” అని నారా లోకేష్ అన్నారు.
తాను ముఖ్యమంత్రినైతే ఆంధ్రాలో సంపూర్ణ మద్య నిషేదం అమలుచేస్తానని చెప్పిన జగన్, నాలిక మడతేసి, మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను తన గుప్పిట్లో పెట్టుకొని మద్యం అమ్మకాలతోనే నెలకు రూ.100 కోట్లు ఆదాయం సమకూర్చుకొంటునారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గతంలో మరే ప్రభుత్వం ఇవ్వనంతగా సంక్షేమ పధకాలు ఇస్తున్నామని చెప్పుకొంటున్న ‘స్కామ్ మోహన్’ తమ ప్రభుత్వం అమలుచేసిన 100కి పైగా సంక్షేమ పధకాలను రద్దు చేసిన ఘనుడని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలన్నీ రద్దు చేస్తుందని వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, “జగన్ ప్రభుత్వం రద్దు చేసిన పధకాలనే కాదు ఇంకా అనేక కొత్త పధకాలను కూడా మేము ప్రవేశపెడతాము,” అని నారా లోకేష్ ప్రకటించారు.
“ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రజలు జగన్ ప్రభుత్వానికి గంట కొట్టేశారు. వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. గత ఎన్నికలలో ఉరవకొండ ప్రజలు టిడిపికి అండగా నిలబడి పయ్యావుల కేశవ్ను గెలిపించుకొన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి,” అని నారా లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



