నిన్న రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్రమోడీని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు “వరంగల్లో మీ చెల్లెలు వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు స్పందించలేదేమి? హైదరాబాద్లో పోలీసులు ఆమెను కారుతో సహా క్రేన్తో పోలీస్ స్టేషన్కి తరలిస్తే ఖండించలేదేమి?” అని అడిగారని దానికి జగన్ జవాబు చెప్పకుండా చిర్నవ్వుతో తప్పించుకొన్నారని కొన్ని వెబ్సైట్లు వ్రాశాయి. ఆమె అన్న జగన్ స్పందించనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించి ఆమెకి ఫోన్ చేసి సానుభూతి తెలిపారని వీలైతే ఢిల్లీకి వచ్చి కలవమని కూడా చెప్పారని వ్రాశాయి.
ప్రధాని నరేంద్రమోడీ జగన్ని అడిగారో లేదో తెలీదు. వైఎస్ షర్మిలకి ఫోన్ చేశారో లేదో కూడా ఎవరికీ తెలీదు. కానీ నిన్న ప్రధాని నరేంద్రమోడీతో సిఎం జగన్ మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోతో ఈ కధలు అల్లేసి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోలతో కొన్ని వార్తలు వచ్ఛిన్నట్లే ఇవి కూడా వచ్చాయనుకోవలసి ఉంటుంది.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం?అనే చర్చలో ఆమె బిజెపి వదిలిన బాణం అని “ఆరెంజ్ ప్యారెట్” అని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నప్పుడు, ప్రధాని నరేంద్రమోడీ ఆమెకి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడితే వారి వాదనలు నిజమని ధృవీకరించినట్లే అవుతుంది కదా?కనుక బిజెపి అటువంటి పొరపాటు చేయదనే భావించవచ్చు.
అయితే వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మొదట స్పందించింది ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయే. కానీ ఆ తర్వాత ఆమె చేస్తున్న హడావుడితో తన ప్రజా సంగ్రామ యాత్ర హైజాక్ అవుతోందని గుర్తించడంతో మరి స్పందించలేదు. ఆమె కేసీఆర్ని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కొద్దీ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బలపడుతుంది. అంటే ఆమె వలన బిజెపికి నష్టం టిఆర్ఎస్కి లాభం కలుగుతోందని అర్దం అవుతోంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఖమ్మం జిల్లాలో, హైదరాబాద్లో వైసీపీని అభిమానించే ఆంద్రా ఓటర్లు ఉన్నచోట కాస్త ఆదరణ ఉంది కనుక ఆ ప్రాంతాలలో రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ ఓట్లకు చీల్చి బిజెపికి పరోక్షంగా సాయపడగలరు కూడా. కనుకనే ఆమె ఎవరు వదిలిన బాణం?అనే ప్రశ్న వినిపిస్తోందని చెప్పవచ్చు. ఒక రాజకీయపార్టీ విశ్వసనీయతపై ఇటువంటి సందేహం ఉంటే నష్టపోయేది ఆ పార్టీయే. ఏపీలో జనసేన పార్టీ విశ్వసనీయతని ప్రశ్నార్దకంగా మార్చేందుకు వైసీపీ నేతలు ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తే ఇది అర్దం అవుతుంది.



