రాష్ట్రాలను రెడ్లు మాత్రమే పాలించాలా?

Revanth_Reddy_PCC_President_Telanganaతెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇటీవల కర్నాటకలో సేడంలో జరిగిన వేమారెడ్డి మల్లమ్మ 600 ఏళ్ల జయంతి ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు ప్రసంగిస్తూ కేవలం రెడ్లకు మాత్రమే పోరాట పటిమ ఉంటుందని కనుక అధికారం వారి చేతుల్లో ఉంటేనే మంచిదన్నట్లు మాట్లాడారు.

ఆయన తన వాదనను సమర్దించుకోవడం కోసం అలనాడు రాణీ రుద్రమదేవికి రెడ్డి సామంత రాజులు అండగా ఉన్నంతకాలం కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించగలిగారని, కానీ ఆమె తరువాత రాజ్యాధికారం చేపట్టిన ప్రతాప రుద్రుడు రెడ్డి రాజులను కాదని పద్మనాయక వెలమలకు ప్రాధాన్యం ఇవ్వడంతో కాకతీయ సామ్రాజ్యం పతనం అయ్యిందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

నేటి రాజకీయాలలో రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించేందుకు రేవంత్‌ రెడ్డి ఆనాటి పరిస్థితులతో ముడిపెట్టి తన వాదనలను సమర్ధించుకొన్నప్పటికీ నేడు అటువంటి పరిస్థితులు లేవు కనుక సొంత పార్టీతో సహా అన్ని పార్టీల నుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

అందరి కంటే ముందుగా కాంగ్రెస్‌లో సీనియర్ బీసీ నేత వి.హనుమంతరావు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని, దాని వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తానని చెపుతున్న బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్‌ పార్టీలో బీసీ నేతలు “ఎల్లకాలం రాజ్యాధికారం రెడ్ల చేతిలోనే ఉండిపోవాలని రేవంత్‌ రెడ్డి కోరుకొంటున్నారా?అగ్ర కులాలు మాత్రమే త్యాగాలు చేశాయా? 95 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎటువంటి త్యాగాలు చేయలేదా? వారు ఎప్పటికీ అగ్రకులాల కింద పనిచేస్తూ వారి జెండాలు మోసుకు తీరాల్సిందేనా? వారికి రాజ్యాధికారం లేదా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం విడిపోనంత వరకు కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో రెడ్లదే పైచేయిగా ఉండేదని అందరికీ తెలుసు. కానీ రెడ్డి జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమ తెలంగాణ నుంచి విడిపోయి ఏపీలోకి రావడంతో తెలంగాణ రాజకీయాలపై రెడ్డి కులస్థుల పట్టు తగ్గింది. ఏపీలో మళ్ళీ రెడ్డి కులస్తుల చేతిలోకి అధికారం వచ్చింది.

అయినప్పటికీ, సిఎం జగన్మోహన్ రెడ్డి రేవంత్‌ రెడ్డిలాగ వితండవాదం చేయకుండా, జనాభా పరంగా ఎక్కువ శాతం ఉన్న బీసీల మద్దతు లేనిదే అధికారం చేతిలో ఉండదని గ్రహించి బీసీ పల్లవి ఎత్తుకొన్నారని చెప్పవచ్చు. బీసీలకు రాజ్యసభ సీట్లు, మంత్రి పదవులు, వారితో బస్సు యాత్రలు వగైరా ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తున్నాయి. వాటితో మళ్ళీ రాజ్యాధికారం తమ చేతిలోకి తెచ్చుకోవాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది.

కనుక కొంత మంది ధనవంతులైన బీసీలకు మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తే రాష్ట్రంలో దయనీయ జీవితాలు గడుపుతున్న బీసీ ప్రజల జీవితాలలో ఎటువంటి మార్పురాదని గ్రహించవలసి ఉంది. కనుక తమకు మేలు చేసేవారిని గుర్తించి వారి నాయకత్వంలో ముందుకు సాగడమే మంచిది.

ADVERTISEMENT
Latest Stories