ఈ దేశంలో సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేసేవారు ఎక్కువ. దాదాపు రాజకీయ నాయకులు అందరూ ఈ విధంగా వ్యవహరిస్తుండటం వల్లనే రాజకీయాలంటే ఏదో బూతు పదమన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
కానీ ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలు నిజంగానే ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటారు. చాలా మంది నాయకులు రాజకీయ లెక్కలతో స్పందిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పట్ల మనసుతో స్పందిస్తారు.
ఆయన అధికారంలో లేనప్పుడే తన రాజకీయాల ద్వారా వేలాదిమందికి సాయపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కనుక ప్రజలకు మరింత మేలు చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో మారుమూల గ్రామాలకు, లంక గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇందుకు మరో తాజా ఉదాహరణ: అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టును ఆహ్వానించి ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.84 లక్షలు బహుమతిగా అందించారు. ప్రభుత్వం తరపున కాదు… తన స్వార్జితం నుంచి!
ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి అందించినా అది అభినందనీయమే. కానీ పవన్ కళ్యాణ్ తన స్వార్జితం నుంచి అందించి మానవత్వం చాటుకున్నారు.
వారందరూ అంధ యువతులు. వేర్వేరు రాష్ట్రాల్లోని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న మహిళా క్రికెటర్ల పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక నిరుపేద కుటుంబాల్లోని అంధులైన మహిళా క్రికెటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం.
వారిలో చాలామందికి ఇల్లు గడవడం కష్టం. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్లు దొరికితే వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ… లేకపోతే పస్తులే అని ఓ యువతి చెప్పింది.
తిండికే ఇబ్బంది పడుతున్నవారు పౌష్టికాహారం, ఇల్లు, వైద్యం తదితర ఇతర సౌకర్యాల గురించి ఆలోచించి ప్రయోజనం ఉండదు. వారిలో ఒక్కో క్రీడాకారిణికి ఒక్కో రకమైన కష్టాలు, అవసరాలు ఉన్నాయి.
ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తమను ఆహ్వానించడం గొప్ప విషయమనుకుంటే, తమలో ప్రతీ ఒక్కరితో మాట్లాడుతూ తమ పేర్లు, వివరాలు, అవసరాలు, సమస్యలు అన్నింటినీ బుక్లో నోట్ చేసుకోవడం తమను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని ఓ మహిళా క్రికెటర్ అన్నారు.
అంతేకాదు… ఆయన తమ తమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా సంబంధిత మంత్రులతో మాట్లాడి తమ సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తానని చెప్పడం తమను మరింత ఆశ్చర్యపరిచిందని మరో మహిళా క్రికెటర్ అన్నారు.
తాము చాలా మంది రాజకీయ నాయకులను కలిశాము కానీ ఇలాంటి మనసున్న నాయకుడిని ఎన్నడూ కలవలేదని మరో మహిళా క్రికెటర్ అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఆంధ్రా టీమ్ కెప్టెన్ దీపిక తమ ఊరికి తారు రోడ్డు వేయించాలని అభ్యర్థించారు. ఆయన వెంటనే అధికారులను ఆదేశించారు. కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్, తహసిల్దార్ తదితరులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టికి వచ్చి రోడ్లను పరిశీలించారు.
హేమవతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఆమె ఉదయం రోడ్డు కోసం డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ను అభ్యర్థించగా సాయంత్రం 5 గంటలకల్లా రోడ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు!
ఈ ఘటన రెండు కఠిన నిజాలను బయటపెడుతోంది. దేశంలో మన క్రీడాకారుల దుస్థితి, 2. రాజకీయ నాయకులు ఈ విధంగా మనసుతో స్పందిస్తే ప్రజలకు మేలు చేయవచ్చు.




