జనసేనాని పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన ఢిల్లీ చేరుకొన్నారు. ఆయనతో పాటు జనసేన రాజకీయవ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నిన్న కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్లతో సమావేశమయ్యారు. మంగళవారం మళ్ళీ ఉదయం మరోసారి మురళీధరన్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మురళీధరన్ ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రంలోగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు. వారితో కూడా సమావేశాలు ముగిసిన తర్వాత తాము ఏమి చర్చించామో తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ మీడియా ప్రతిధులకు చెప్పారు.
పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకొని కేంద్రమంత్రులు, ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ భేటీ అవడంతో అప్పుడే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యింది కనుక కర్ణాటకలో బిజెపి తరపు ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా కోరేందుకు పిలిపించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మురళీధరన్తో వరుసగా రెండుసార్లు సమావేశమవడంతో ఏపీ రాజకీయాల గురించి చర్చించేందుకే పిలిపించి ఉండవచ్చని స్పష్టమవుతోంది. ఏపీ సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన నాలుగైదు రోజులకే పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినందున, ఏపీ రాజకీయాల గురించే చర్చించిన్నట్లు భావించవచ్చు.
టిడిపికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉండాలని జగన్ గట్టిగా కోరుకొంటున్నారు కనుక ఇదే విషయం బిజెపి పెద్దలకు తెలియజేసి, బిజెపి-వైసీపీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్కు నచ్చజెప్పాలని కోరి ఉండవచ్చు. బిజెపి కూడా పవన్ కళ్యాణ్ తమతోనే ఉండాలని కోరుకొంటోంది కనుక పవన్ కళ్యాణ్ని పిలిపించి పొత్తులు కొనసాగిద్దామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించడం సహజమే.
కానీ పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపిని దూరం చేసుకొని టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దం అవుతున్నందున, ఆయన కూడా అప్పులు, అమరావతి, పోలవరం ప్రాజెక్టు, వైసీపీ అరాచక పాలన తదితర అంశాల గురించి వివరించి, రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు వైసీపీని ఓడించేందుకు కేంద్రం సహకరిస్తే రాష్ట్రంలో బిజెపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెప్పవచ్చు. ఇందుకోసం టిడిపిని కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని ఒత్తిడి చేయవచ్చు. అందుకు బిజెపి ఒప్పుకొంటుందా లేదా అనేది మరికొన్ని గంటలలో తెలుస్తుంది. కనుక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, కేంద్రమంత్రులతో భేటీలతో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు.



