పవన్ కళ్యాణ్‌కి పూర్తి స్పష్టత ఉంది.. మరి శ్రేయోభిలాషులకో?

Pawan Kalyan addressing Jana Sena leaders about TDP alliance and Andhra Pradesh politics

కోలీవుడ్‌ హీరో విజయ్‌ టీవీకే పార్టీతో తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకున్నప్పుడు జనసైనికులు, పవన్ కళ్యాణ్‌ మద్దతుదారులు, పార్టీలో.. బయటా శ్రేయోభిలాషులమని చెప్పుకునే కొందరు మేధావులు పవన్ కళ్యాణ్‌ కూడా ఆవిధంగా ఒంటరిగా పోటీ చేసి ఉండాల్సిందన్నారు. టీడీపితో పొత్తుపెట్టుకొని చాలా తప్పు చేశారన్నారు. ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే ఆయనే సిఎం అయ్యేవారన్నారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున సోషల్ మీడియాలో ఈ చర్చలే సాగాయి. వాటికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ స్వయంగా సమాధానం ఇవ్వడమే కాకుండా వారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేశారు.

ADVERTISEMENT

శుక్రవారం రాత్రి మంగళగిరిలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్‌ చెప్పిన ముఖ్య విషయాలు..

నేను కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్‌లా ఒంటరిగా పోటీ చేసి ఉండాల్సిందని సలహాలు చెప్పినవారందరూ, 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎక్కడున్నారు?

ఇలాంటి సలహాలు చెప్తున్నవారందరూ నాడు నన్ను వదిలిపారిపోయారు. కానీ జనసైనికులు, వీరమహిళలు మాత్రమే నన్ను అంటిపెట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో నాకు కొండంత అండగా నిలబడ్డారు.

మళ్ళీ 2024 ఎన్నికలలో కూడా ఏమీ ఆశించకుండా నా కోసం రేయింబవళ్ళు పనిచేశారు. అలాంటివారిని మరిచిపోతానని ఎలా అనుకున్నారు?

పదవులే కావాలనుకుంటే పార్టీ పెట్టినప్పుడే ఆఫర్లు వచ్చాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోవడమే ముఖ్యమనుకున్నాను. వెనక్కు తగ్గాను.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు వంటి పెద్ద మనిషిని జగన్‌ ప్రభుత్వం జైల్లో పెడితే చాలా బాధపడ్డాను.

జైల్లో ఆయనని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఓ ఖండన ప్రకటన చేసి, సానుభూతి ప్రకటించి చేతులు దులుపుకు వెళ్ళిపోవచ్చు. కానీ మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే ఇంట్లో ఆడపిల్లలని కూడా బయటకులాగే భయానక పరిస్థితి నెలకొని ఉంది. ఏపీకి అలాంటి దుస్థితి కలగకూడదనే టీడీపితో పొత్తు పెట్టుకున్నాను తప్ప పదవుల కోసం కాదు.

తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేరు. ఐదేళ్ళ జగన్‌ పాలన తర్వాత 2024లో ఏపీలో నెలకొన్న పరిస్థితులు వేరు. ఈ తేడా గుర్తించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేయడమేనా?

ఇన్నేళ్ళు రాజకీయాలలో ఉన్న నాకు పార్టీని ఏవిధంగా నడపాలో తెలియదని ఎలా అనుకుంటున్నారు?

డెప్యూటీ సిఎం, మంత్రిగా ఈ రెండేళ్ళలో నేను సిఎం చంద్రబాబు నాయుడు దగ్గర పాలనా పరమైన విషయాలు చాలా నేర్చుకున్నాను. రాజకీయాలలో రాణించాలనుకున్నప్పుడు ఇలాంటి శిక్షణ మంచిదే. చాలా అవసరం కూడా.

అలాగని టీడీపికి జనసేన పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు కాదు. టీడీపి-జనసేనల మద్య సమస్యలు వచ్చినప్పుడు నేను, సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని పరిష్కరించుకుంటున్నాము.

ఆంధ్రప్రదేశ్‌ ఇలాగే వేగంగా అభివృద్ధి చెందాలంటే మూడు పార్టీలు ఇలాగే కలిసి నడవడం చాలా అవసరం.

ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పని ఒత్తిడి పెరిగి పార్టీకి తగినంత సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇకపై పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తాను. అందరం కలిసి రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేసుకుందాము, అని జనసేనాని పవన్ కళ్యాణ్‌ తన మనసులో ఆలోచనలను పార్టీ శ్రేణులతో పంచుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories