ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి తెలంగాణలో అధికార చేతికందడానికి పదేళ్ల సమయం పట్టింది. ఆ దశాబ్ద కాలపు ఎదురుచూపులు ఫలించి ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని పొందింది.
అయితే కాంగ్రెస్ అధికార పక్షంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో తమ ప్రభుత్వం పై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించేలా, తమ పాలనతో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూపించేలా ముందుకెళ్లాల్సిన కాంగ్రెస్ అనవసరమైన అంశాల మీద ద్రుష్టి సారిస్తు వెనకబడింది.
కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు పవన్ వ్యాఖ్యలను పట్టుకుని తెలంగాణ ప్రజలలో ప్రాంతీయ రాజకీయాన్ని పుట్టించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే వీరి అత్యుత్సాహం వెనుక ఉన్న ఆ మర్మమేమిటి.? అనేది ఇక్కడ చర్చ.
ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పై విమర్శలు అంటే అది ఒక రకంగా ఏపీలో కొలువుతీరిన ఎన్డీయే కూటమి పై కూడా ప్రభావం చూపుతుంది.
తమ ప్రభుత్వంలో భాగమైన మంత్రి పై పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు అంటే, ఆయన సినిమాల పై మంత్రులు బెదిరింపు హెచ్చరికలకు పాల్పడుతున్నారు అంటే ఇది ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న సత్సబంధాలను దెబ్బ తీయడమే అవుతుంది.
తత్పలితంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మధ్య ఉన్న ఏళ్ళ నాటి బంధాన్ని ఇరుకున పెట్టినట్టే అవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ లబ్ది పొందే పార్టీ ఏది.? ఆ లబ్దిని అందుకునే నాయకుడు ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్న.?
పవన్ ను రాష్ట్ర క్యాబినెట్ నుంచి తప్పించాలి అంటూ ఒకరు, అసలు పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి కి అనర్హుడు అంటూ మరొకరు, అసలు తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వం అంటూ ఇంకొందరు ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు.
అయితే అసలు పవన్ అన్న మాటకి ఇన్ని పర్యాయపదాలు వెతికి మరి విమర్శలు చేయడం అవసరమా.? తెలంగాణ నాయకులు ఇలా వరుసగా పోటీ పడి మరి ఇంతలా మీడియా ముందుకొచ్చి తమ బలప్రదర్శన నిరూపించుకోవడం ముఖ్యమా.? వీరిని పార్టీ అధినేతలు ప్రోత్సహిస్తున్నారా.? లేక అధినేతల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నేతలే తమ సొంత స్వరం వినిపిస్తున్నారా.?
బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మొదలుకుని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత వరకు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోటంరెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనిరుధ్ రెడ్డి సహా ఎవరి మెప్పు కోసం ఇంతలా వీరంతా అత్యుత్సాహం చూపిస్తున్నారు.?
రేవంత్ కి బాబు కి ఉన్న సత్సబంధాలు చెడిపోయేలా, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సానుకూల వాతావరణం ఆవిరయ్యేలా వీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎవరికీ లబ్ది చేకూర్చనున్నాయి.?






