ఆవేశం ఉన్న వారు రాజకీయాలలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరన్న నానుడి ఎప్పటినుండో ఉంది. దీనిని నిజం చేసే విధంగా చాలామంది ఆవేశపరులు నిరూపించారు కూడా! మరి ఆ కోవలోనే ‘జనసేన’ అధినేత పయనిస్తారా? అనే ప్రశ్న పార్టీ స్థాపించిన తొలినాళ్ళల్లో వ్యక్తమైంది. అయితే రానూ రానూ ఆవేశం తగ్గించి, ఆలోచనతో కాస్త ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకున్న పవన్ పరిపక్వతకు రాజకీయ విశ్లేషకులు కూడా ‘శభాష్’ అన్నారు. ఓ పక్కన పొలిటికల్ విమర్శలు వస్తున్నా, వాటిపై పెద్దగా స్పందించని పవన్, తను చేయదలుచుకున్నదే చేసుకుంటూ వస్తున్నారు.
అయితే ‘ప్రత్యేక హోదా’ విషయంలో పవన్ తీసుకున్న నినాదం మాత్రం అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. ఎంతో మెచ్యూరిటీతో ఆలోచిస్తారని భావించిన పవన్, ఇక ప్రత్యేక హోదా రాదని తెలిసినా, దానిని పట్టుకుని ఇంకా ఎందుకు రాజకీయం చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. సహజంగా ఇలాంటి రాజకీయాలు చేసే వారి లక్ష్యం… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాదిరి అధికార పీఠమే..! కానీ, పవన్ ఓ పక్కన తనకు అధికారం వద్దంటారు, మరో పక్కన స్పెషల్ స్టేటస్ విషయంలో రాజకీయ లబ్దితో కూడిన ప్రకటనలు చేస్తుండడం… గందరగోళానికి గురి చేస్తోంది.
తాజాగా వైసీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని సమర్ధిస్తూ… టిడిపి ఎంపీలను విమర్శిస్తూ… పవన్ చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలను మిగిల్చాయి. ముందుగా ఒక్క విషయం స్పష్టత ఇవ్వాలి… ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం. ఇది పవన్ కళ్యాణ్ తో సహా జగన్, చంద్రబాబు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలాగూ రాదు కాబట్టి, దానిని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందే క్రమంలో, ‘స్పెషల్ స్టేటస్’ అంటూ గగ్గోలు పెట్టడం వైసీపీ వ్యూహరచనలో బేసిక్ పొలిటిక్స్. ఇది కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఇట్టే అర్ధమయ్యే విషయం.
మరి ఇంత చిన్న విషయం జనసేన అధినేతకు తెలియదా? “ఒకవేళ తెలిసి” కూడా చేస్తే… అది రాజకీయ లబ్ది కోసమే..! మరి అలాంటప్పుడు తనకు అధికార దాహం లేదు అంటూ పవన్ చేసిన మాటలు అర్ధరహితం. అలాగే “ఒకవేళ తెలియకుండా” చేస్తే మాత్రం… పవన్ లోని రాజకీయ అమాయకత్వాన్ని బయటపెడుతోంది తప్ప, మరొకటి కాదని చెప్పాలి. అధికార పార్టీని విమర్శించడం గానీ, ప్రశ్నించడం గానీ తప్పు కాదు, నిజానికి ఇలాగే ప్రశ్నించాలి కూడా. కానీ తాను రొటీన్ రాజకీయాలు చేయను, అధికారం తన లక్ష్యం కాదంటూ… అవే రొటీన్ రాజకీయాలు చేస్తుండడం మాత్రం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని పవన్ గమనించాలి.



