రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు దశాబ్దాల పాటు రేయింబవళ్ళు కృషి చేసి అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కానీ వారి కొడుకు, కూతురు లేదా సమీప బంధువులో వారి అన్నేళ్ళ శ్రమని చిటికెలో బూడిద చేసేస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా మన కళ్ళ ఎదుటే అనేకమంది కనిపిస్తారు.
తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినందుకు పేట్బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టంలో అత్యంత కటినమైన సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. దీంతో బండి సంజయ్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
మరీ ముఖ్యంగా ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు కుమారుడు బండి భగీరద్ ఇలాంటి కేసులో నిందితుడుగా నిలబడటం ఆయనకు ఇంకా అవమానం. ఇన్ని దశాబ్దాలలో మచ్చలేని నాయకుడుగా, అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ నేతగా బండి సంజయ్ ఇటు ప్రజలలో, అటు బిజేపి అధిష్టానం వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు కొడుకు కారణంగా అయన సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తోంది.
అయితే ఇప్పుడు ఆయనకు ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవే పెద్ద వరంగాను, పెద్ద శాపంగా కూడా మారింది. ఆయన కొడుకుని కాపాడుకోవడానికి తన పదవి, అధికారం దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది.
ఆ పదవిలో ఉన్న అయన స్వయంగా కుమారుడు బండి భగీరద్ని విచారణకు హాజరు కమ్మనమని పోలీస్ స్టేషన్కు పంపించకుండా అజ్ఞాతంలోకి పంపించేసి రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఈ కేసు విచారణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోలీసులపై ఒత్తిడి పెంచుతూ కేసు నమోదు చేయించడం ద్వారా కాంగ్రెస్-బిజేపిల మద్య అగ్గి రాజేయగలిగింది. ఎప్పటికైనా బండి సంజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ కావచ్చని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కనుక ఈ కేసుతో ఆయనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకొని, ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బ తీయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే, కాంగ్రెస్- బిజేపిలు కుమ్మక్కు అయ్యాయనే వాదన బీఆర్ఎస్ పార్టీ వద్ద రెడీగా ఉండనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా బండి సంజయ్ పక్కలో బల్లెంలాగే ఉన్నారు. కనుక ఆలస్యం చేయకుండా బండి భగీరద్పై పేట్బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ ఈ కేసు ఏవిధంగా సాగి ఎలా ముగుస్తుందో ఊహించవచ్చు.




