భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రెండు గండాలను తప్పించుకున్నారని… మాఘమాసంలో మరో పెను గండం పొంచి ఉందని కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లినప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం మొదటి గండమని… ఊహించని విధంగా పాకిస్థాన్ లో దిగడం రెండో గండమని… ఈ రెండు గండాల నుంచి మోడీ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.
కానీ, మాఘమాసం (ఫిబ్రవరి)లో మూడో గండం ఉందని, ఈ గండం చాలా తీవ్రంగా ఉంటుందని నరేంద్ర శర్మ అన్నారు. అయితే, ఈ గండం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని, ఈ గండం నుంచి మోడీ తప్పించుకుంటే… మరో 12 ఏళ్ల వరకు ఆయనకు తిరుగే ఉండదని నరేంద్ర శర్మ స్పష్టం చేశారు. మోదీకి స్త్రీ దోషం ఉందని… అందుకే భార్యకు దూరమయ్యారని, తల్లికి దూరంగా ఉంటున్నారని, తల్లిని తన దగ్గరకు తెచ్చుకుని, ఆమెకు సేవ చేస్తే… దోషం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటు వాస్తు కూడా ప్రధానికి అనుకూలంగా లేదని చెప్పారు.



