ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో వైసీపిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి గేట్లు తెరిస్తే జేరిపోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నందున వారి అవసరమే లేదు.
అయినప్పటికీ ఎవరినైనా చేర్చుకోవాలనుకుంటే వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విదిస్తోంది.
వైసీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టిడిపి కూటమిలో చేర్చుకుంటే ప్రభుత్వం మరింత బలపడుతుంది… వైసీపి బలహీనపడుతుంది కదా?అంటే అవసరం లేనప్పుడు కూడా వారి కోసం టిడిపి, జనసేనలు కక్కుర్తిపడితే కొత్త సమస్యలు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది.
ఉదాహరణకు పొరుగున తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వం ఏర్పాటుకి సరిపడా ఎమ్మెల్యేల కంటే మరో ఐదుగురు మాత్రమే అదనంగా ఉన్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్ఎస్ నేతలు పదేపదే బెదిరించేవారు. దాంతో అప్రమత్తమైన సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేసుకున్నారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలం పెరిగినప్పటికీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాలలో విచారణ ప్రారంభించాలని, లేకుంటే మేమే జోక్యం చేసుకుంటామని హైకోర్టు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి నోటీసు జారీ చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాటిని అధిగమించడం ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య కాదు. తప్పనిసరి అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలలో మళ్ళీ గెలిపించుకోగలరు. లేదా వారి స్థానంలో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉండేవారిని పోటీ చేయించి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని మరింత పదిలం చేసుకోవచ్చు.
కనుక పార్టీలో చేరాలనుకుంటున్న వైసీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత ముందే రాజీనామాలు చేయించాలనే సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైనదే అని రుజువు అవుతోంది.




