అవినీతి సొమ్ముతో మొదటి కిక్కు.. తర్వాత కిక్కులు వేరబ్బా!

Telangana CM Revanth Reddy criticizing KCR family and YCP leaders over corruption allegations

అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడి భారీగా ఆస్తులు, వేలకోట్లు సొమ్ము పోగేసుకోవడం పరిపాటి. “ఆ అక్రమార్జనతో ఈ ప్రపంచాన్నే జయించవచ్చనే నమ్మకం కలుగుతుంది. అది అహంకారానికి చివరికి పతనానికి దారి తీస్తుంది,” అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కేసీఆర్‌ కుటుంబమే నిదర్శనమన్నారు.
నిన్న ఆదిలాబాద్‌ సభలో ప్రసంగిస్తూ, “ఇక్కడ కట్టాల్సిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పేరు, ఊరు మార్చి కాళేశ్వరం కట్టారు. ఆ పేరుతో వేలకోట్లు వెనకేసుకున్నారు. కానీ ఆయన ఆ కుర్చీలో ఉండగానే ఆ ప్రాజెక్టు క్రుంగిపోయింది. లక్ష కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టుతో ప్రజలకు ప్రయోజనం కలగలేదు. కానీ ఆయన ఇంట్లో కనకవర్షం కురిసింది.
ఆ అవినీతిసొమ్ము కోసమే కల్వకుంట్ల కుటుంబంలో కీచులాడుకుంటూ విడిపోతున్నారు. ప్రజాధనం దోచుకొని బాగుపడినవారు ఎవరూ ఉండరని చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంది?” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆయన మాటలు సర్వత్రా వర్తిస్తాయని ఆంధ్రాలో జగన్‌-షర్మిల-విజయమ్మల మద్య ఆస్తుల కీచులాటలు చూస్తే అర్ధమవుతుంది. ఆస్తుల కోసమే అన్నా-చెల్లి విడిపోయారు. ఇప్పుడు ఒకరి మొహాలు మరొకరు చూసుకోలేని పరిస్థితిలోఉన్నారు. పైగా అవినీతి ఆస్తుల కోసం కోర్టుల వరకు వెళ్ళి పోరాడుకుంటున్నారు కూడా.
వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు కూడా ఇదే నిరూపిస్తున్నాయి కదా?నాడు అక్రమాస్తుల కేసులు మొదలు నేడు పరకామణి వరకు అనేక కేసులు కనిపిస్తున్నాయి. ప్రతీ కేసులో ఆ పార్టీ నేతలు జైలుకి వెళ్ళి వస్తూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
కనుక అవినీతి సొమ్ముతో తాత్కాలిక ఆనందం లభించవచ్చు కానీ చివరికి కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ, అవినీతి సొమ్ముతో లభించే ఆనందం, రాజకీయ పరపతి కోసం ఇటువంటి కష్టాలు, సమస్యలు, అప్రదిష్టని భరించడానికి సిద్ధపడేవారూ మన రాజకీయాలలో చాలా మందే ఉన్నారు. అందువల్లే అవినీతి మానుకోవడం లేదు కేసులకీ భయపడటం లేదు!
ఓ మూడు నాలుగు నెలలు జైల్లో గడిపినా ఏదో రోజు తప్పకుండా బెయిల్‌ వస్తుంది. బయటకు రాగానే “మేము ఆణిముత్యాలం… చివరికి న్యాయం ధర్మం గెలిగిచింది,” అని చెప్పుకునే వెసులు బాటు ఉందిప్పుడు. కనుక అవినీతి-ఆనందం-అప్రదిష్టని వేరు చేసి చూడలేము.

ADVERTISEMENT
Latest Stories