టాలీవుడ్లో దాదాపు ప్రతీ ఒక్కరూ ఘాటుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖని విమర్శించారు. ఆమె చేసిన వ్యాఖ్యల కంటే టాలీవుడ్ నటీనటులు పోటీలు పడి విమర్శించడమే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే నేటికీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఎవరూ ఆమెకు అండగా నిలబడి మాట్లాడలేదు.
కానీ సోషల్ మీడియాలో ఆయనని గట్టిగా వెనకేసుకువస్తూ ప్రత్యర్ధులతో యుద్ధాలు చేస్తున్న ‘రేవంత్ రెడ్డి సైన్యం తెలంగాణ’ ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటీనటులందరికీ వార్నింగ్ ఇచ్చింది.
కొండా సురేఖగారు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయినా ఈరోజు మాట్లాడిన ప్రముఖులందరినీ మేము గుర్తుపెట్టుకుంటాము. త్వరలో ఒక రోజు వస్తుంది. అప్పుడు కూడా అందరూ ఇదేవిదంగా స్పందించాలి లేకుంటే మీకుంటుంది శోకాల్డ్ యాక్టర్స్… డ్రామారావు (కేటీఆర్) గెట్ రెడీ, ముందుంది ముసళ్ళ పండుగ. అని ట్వీట్ చేశారు.
“సో కాల్డ్ యాక్టర్స్… ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పే దమ్ముండా? అవకాశాల పేరుతో ఆడపిల్లలను వేదించడం లేదని నిరూపిస్తారా? కోట్లాది యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు… డ్రగ్స్, రేవ్ పార్టీలతో అడ్డదారులు తొక్కుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?” అని మరో ట్వీట్ చేశారు.
“జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తవగానే ఒక్కొక్కని సంగతి చెపుదాము. డ్రగ్స్ కేసు బయటకు తీస్తే ప్రతీ ఒక్కడూ బయటకు వస్తాడు,” అని వార్నింగ్ ఇచ్చారు.
చివరిగా “Yess ఇప్పుడు కూడ చెప్తున్నాం.. బరా బర్ డ్రగ్స్ కేస్ re investigate చేస్తం. డ్రగ్స్ రహిత రాష్ట్రమే ఈ ప్రభుత్వ లక్ష్యం సినిమా హీరోలకు హీరోయిన్లకు భయపడే ప్రభుత్వం కాదు ఇది.. పేద మధ్య తరగతి ప్రజలు సినిమా చూసేలా టికెట్ రేట్లు కూడా 100 రూపాయలకు తక్కువ ఉండేలా చేస్తాం,” అని మరో వార్నింగ్ ఇచ్చారు.
గత 5 ఏళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమ జగన్ చేతిలో నలిగిపోతే ఇప్పుడు ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు అత్యుత్సాహం ప్రదర్శించి తెలంగాణలో ఇబ్బందులు సృష్టించుకున్నట్లయింది. హైదరాబాద్లోనే సినీ పరిశ్రమ, ప్రముఖులు ఉన్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆగ్రహం కలిగితే జగన్ వల్ల కలిగిన నష్టం కంటే పదిరెట్లు ఎక్కువ నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఈ ట్వీట్స్ స్పష్టం చేస్తున్నాయి.





