నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అయన పోరాట స్పూర్తి, పట్టుదల, కార్యదక్షత, వ్యూహ రచన గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవచ్చు.
మాజీ సిఎం కేసీఆర్ ఓటుకి నోటు కేసుని రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంపై చెరగని మరకగా మార్చారు. ఆ కేసులో జైలుకి పంపారు. ఓ విధంగా ఆయనని కేసీఆర్ రాజకీయంగా సమాధి చేసేశారు.
కానీ రేవంత్ రెడ్డిలో అదే రాజకీయ కసి రగిలించింది. ఎప్పటికైనా కేసీఆర్ని ఓడించి అదే జైలులో చిప్ప కూడు తినిపిస్తానని అప్పుడే శపథం చేశారు. కానీ అప్పుడు కేసీఆర్ కంటిచూపుతో తెలంగాణ రాజకీయాలను శాశిస్తున్నారు. కనుక రేవంత్ రెడ్డిని చూసి అందరూ నవ్వుకున్నారు.
కానీ కేసీఆర్ కూడా ఊహించలేని విదంగా రేవంత్ రెడ్డి చాలా తక్కువ సమయంలోనే రాజకీయంగా ఎదిగారు. కానీ అప్పటికీ కేసీఆర్ ప్రమాదం పసిగట్టలేకపోయారు లేదా అహంభావంతో రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు.
తనది ప్రధాని మోడీ స్థాయి అనే భ్రమలో మోడీతో కయ్యానికి కాలు దువ్వుతూ, రాష్ట్రంలో బీజేపిని ఓడిస్తే చాలనుకున్నారు.
అందుకు బలమైన కారణమే ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ తమలో తాము పదవుల కోసం కీచులాడుకునేవారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆయనను బహిరంగంగానే విమర్శించేవారు.
మరోపక్క కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో సుశిక్షితులైన సైన్యం వంటి నేతలు, కార్యకర్తలు ఉండేవారు. చూసి రమ్మంటే కాల్చి రాగల సమర్దులే అందరూ. పైగా అధికారం యంత్రాంగం అంతా కేసీఆర్ చెప్పుచేతలలోనే ఉంది.
కనుక కాంగ్రెస్ని… దానిలో బాహుబలిగా మారుతున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ అసలు పట్టించుకోనేలేదు. ఆయన దృష్టి అంతా బీజేపి… అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్పైన, ఇంకా జాతీయ రాజకీయాలపైనే ఉండేది.
కానీ వానర సైన్యం వంటి కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల యుద్ధభూమి వరకు వచ్చే వరకు కేసీఆర్ ఆయన శక్తి సామర్ధ్యాలను గ్రహించనే లేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు అందరూ రేవంత్ రెడ్డి వెంట నడవడం మొదలుపెట్టారో అప్పుడు కేసీఆర్ అప్రమత్తమయ్యారు.
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. చివరి ప్రయత్నంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని మాట్లాడితే, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేసి వెళ్ళిపోయారు!
ఆ తర్వాత కేసీఆర్ ఎన్ని వ్యూహాలు పన్ని అమలుచేసినా అన్నిటినీ రేవంత్ రెడ్డి చిత్తుచిత్తు చేస్తూ, అపర చాణక్యుడు అని పేరొందిన కేసీఆర్ని ఓడించారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు.
ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిర్ణయిస్తున్నట్లు తెలియగానే మళ్ళీ సీనియర్ కాంగ్రెస్ నేతలు రంకెలు వేశారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేకపోయారనే విషయం కాంగ్రెస్ అధిష్టానం వారికి గుర్తుచేసి రేవంత్ రెడ్డిని సిఎంని చేసింది.
ఆ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ మంత్రి పదవులు సముచిత ప్రాధాన్యం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గౌరవించడంతో అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు.
కేసీఆర్ అందరితో ఏదో వంకతో గొడవలు పెట్టుకొని శత్రువులను పెంచుకుంటే, సిఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోతూ అందరి సహాయ సహకారాలతో తాను గెలిచి, పార్టీని అధికారంలోకి తెచ్చి అందరికీ రాజకీయ పునరుజ్జీవనం కల్పించారు.
తన ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మెడలకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఎఫ్-1 రేసింగ్ కేసులు తగిలించేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడకపోయి ఉంటే, ఆ కేసుల్లోనే వారు ముగ్గురినీ ఎప్పుడో జైలుకి పంపించి ఉండేవాడినని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
2023 డిసెంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు కీలకదశకు చేరుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో సొంత ఇంట్లోనే నిర్బందించి బయటకు రాకుండా చేశారు కేసీఆర్.
కానీ సిఎం రేవంత్ రెడ్డి గత రెండేళ్ళుగా కేసీఆర్ని ఫామ్హౌసులో నుంచి బయటకు రాకుండా చేశారు. మరో మూడేళ్ళవరకు ఫామ్హౌసులో నుంచి బయటకు రాకపోవచ్చని కేటీఆర్ చెప్పుకున్నారు.
జైలు లోపల, బయటా పోలీసులు కాపలా ఉంటారు. అదేవిదంగా కేసీఆర్ ఫామ్హౌసు చుట్టూ కూడా పోలీసులు కాపలా ఉన్నారు. కనుక కేసీఆర్ జైలులో ఉన్నట్లే. ఓ రాజకీయ నాయకుడుకి ఇంతకంటే వేరే శిక్ష ఉంటుందా?అన్న సిఎం రేవంత్ రెడ్డి మాటలు ఆలోచింపదగినవే కదా?
తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ పేరు ఏవిదంగా ఎప్పటికీ నిలిచిపోతుందో, కాంగ్రెస్ పార్టీలో కూడా సిఎం రేవంత్ రెడ్డి పేరు ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది.







