మన మంత్రులకు శాఖలు ఉన్నట్లే కొన్ని మతాలలో దేవుళ్ళకి కూడా శాఖలు ఉంటాయిని అందరికీ తెలుసు. కానీ దేవుళ్ళలో పేదల దేవుళ్ళు, ధనికులకు వేరేగా దేవుళ్ళు కూడా ఉంటారు. ఆ దేవుళ్ళకు ఈ పేద, ధనిక పట్టింపు ఉండదు. కానీ మనుషులకు ఉంటుందనే కొత్త విషయం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
నిన్న కరీంనగర్ సభలో మాట్లాడుతూ, “ఇటీవల మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. రెండు కోట్ల మంది భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు.
జాతర మొదలయ్యే ముందు నేను మా మంత్రులు సీతక్క, సురేఖలని కేసీఆర్ ఇంటికి పంపించి ఈ జాతరకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఆహ్వానించిన ఎవరూ రాలేదు.
కేసీఆర్ రాలేకపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ తెల్లారిలేస్తే ఊర్లన్నీ తిరిగే కేటీఆర్, హరీష్ రావులకి ఏమయింది? వాళ్ళైనా వచ్చి అమ్మవార్లను దర్శించుకోవచ్చు కదా? కానీ రాలేదు.
ఎందుకంటే సమ్మక్క, సారలమ్మ, వేములవాడ రాజన్నలు పేదవారి దేవుళ్ళు కనుక! వారిని దర్శించుకోవాలంటే ఈ దొరలకు చాలా నామోషీ కనుక! అందుకే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడూ ఆయన ఈ దేవుళ్ళని దర్శించుకోవడానికి రాలేదు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి చెప్పింది కాస్త అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ వాస్తవమే. ఎలాగో చూద్దాం. రాష్ట్ర విభజనతో తిరుమల ఏపీకి దక్కింది. కనుక వెంకన్నకి పోటీగా తెలంగాణకు కూడా ఓ ధనిక దేవుడు ఉండాలని కేసీఆర్ అనుకున్నారు. అంతే! సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసి యాదగిరి గుట్టని ‘యాదాద్రి’గా మార్చేశారు.
ఆ స్వామివారు తన స్థాయికి తగిన దేవుడని కేసీఆర్కి నమ్మకం కలిగినందుకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అదృష్టమే. లక్ష్మీ సమేతుడైన ఆ స్వామివారిని ధనవంతుడిని చేసిన క్రెడిట్ కూడా కేసీఆర్కే దక్కుతుంది. అందుకే కేసీఆర్ తరచూ యాదాద్రికి వెళ్ళి వస్తుండేవారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ పేద, ధనిక దేవుళ్ళ సిద్దాంతం నిజమేనని భావించవచ్చు.






