తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిర్వదిక సమ్మె మొదలుపెట్టారు. ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, “మేము కొత్తగా అడుగుతున్నవేవీ లేవు. గతంలో ఒప్పుకున్నవి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలుచేయమని కోరుతున్నాము. మంగళవారం సాయంత్రం హడావుడిగా చర్చలకు పిలిచి ఏ ఒక్క డిమాండ్ అంగీకరించకుండా మరో నెల రోజులు సమయం కావాలన్నారు.
42 రోజుల క్రితం మేము నోటీస్ ఇస్తేనే ఇంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు మరో నెల రోజులంటే వారికి చిత్తశుద్ధి లేదని కేవలం కాలయాపన చేస్తూ మమ్మల్ని నిందించడానికే చర్చలకు పిలిచారని భావిస్తున్నాం. కనుక అయిష్టంగానే సమ్మె మొదలుపెట్టక తప్పలేదు,” అని అన్నారు.
చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ సమ్మె మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలలో నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఏపీ ప్రభుత్వంలో విలీనమయ్యి అప్పుడే 7 ఏళ్ళవుతోంది. కానీ కేసీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి టిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు. తప్పదంటే టిఎస్ ఆర్టీసీని మూసేస్తాను తప్ప విలీనం చేయనని నాడు కేసీఆర్ ఖరాఖండీగా చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆర్ధిక సమస్యలలో తీవ్ర చిక్కుకొని అల్లాడుతున్నా, చివరికి 40 మంది వరకు చనిపోయినా కేసీఆర్ పట్టించుకోకుండా చాలా కర్కశంగా వ్యవహరించారు. అప్పటి ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్లో నిరంకుశత్వం బయట పడింది.
కేసీఆర్ హయంలో వారు సమ్మె చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. వారి డిమాండ్స్, సమ్మె న్యాయమైనవేనన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
రేవంత్ రెడ్డి సిఎం కాగానే మొట్టమొదట తమ సమస్యలని పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు ఇంత కాలం ఎదురు చూశారు. కానీ ఇంత వరకు చెయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో కార్మికలు సమ్మె మొదలుపెట్టారు.
ఈ సమ్మెని కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా ముగించగలిగితే సిఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. లేకుంటే ఆయనకి కూడా కేసీఆర్లా అప్రదిష్ట తప్పాడు. కనుక సమ్మె ముగించాల్సిన బాధ్యత కార్మిక సంఘాల నేతలపై కంటే రేవంత్ ప్రభుత్వంపైనే ఎక్కువగా ఉంది.




