రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి వెలువడిన ఈ ఒక్క ప్రకటన ప్రభుత్వం vs ప్రతిపక్షం, మధ్యలో విద్యార్థులు అనేలా మారిపోయింది.
TGIIG ప్రకారం ప్రభుత్వం వేలం వేయనున్న 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ కాంగ్రెస్ వాదిస్తుంది. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతుంది, అదే గొడ్డలి…కొత్త చేతులు అంటూ బీజేపీ, బుల్డోజర్లు, జేసీబీలను చూసి నెమళ్ళు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి అంటూ బిఆర్ఎస్, ఈ భూమి తమ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది అంటూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇలా ఎవరి పోరాటం వారు చేస్తూ తెలంగాణ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరు చెప్పి సుమారు 25 లక్షల చెట్లను బిఆర్ఎస్ నరికేసింది, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేక 400 ఎకరాల పచ్చదన్నాని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం పేరుతో ఛిదిమేస్తుంది అంటూ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఇక బిఆర్ఎస్ విషయానికి వస్తే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచి గచ్చిబౌలి భూములను ఆనుకుని అనేక వన్య ప్రాణులు జీవనం కొనసాగిస్తున్నాయని, ఇప్పుడు వేలం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములలోకి బుల్డోజర్లు, జేసీబీలను పంపడంతో అక్కడి వన్య ప్రాణులంతా సాయం కోరుకుంటున్నాయని, ఆ సాయాన్ని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ అందించాలంటూ తన పార్టీ వాదనను వినిపిస్తున్నారు.
అలాగే ఈ అధికార విపక్షాల రాజకీయంలోకి వచ్చారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ప్రభుత్వం వేలం వేయనున్న భూములలో మా కళాశాల భూములు కూడా ఉన్నాయంటూ, మాకు సంబందించిన భూమిలో ఒక్క గజం భూమిని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు HCU విద్యార్థులు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరి వాదన ఎలా ఉన్న ఈ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని, దీనిలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అటవీ భూమి కానీ, వన్య ప్రాణుల హాని కలిగించే అంశం కానీ లేవంటూ ఖరాకండిగా చెపుతుంది. అలాగే బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నట్టు ఇక్కడ గ్రీన్ మర్డర్ కూడా జరగడం లేదని వాదిస్తుంది. ఇదంతా కూడా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు అంటూ కొట్టిపడేస్తుంది.
ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల ఆస్తి. అందుకు జవాబుదారిగా ప్రజలకు అసలు విషయాన్ని చెప్పి వారి ఆమోద ముద్రతో, వారి అంగీకారం తో ప్రభుత్వాలు ముందుకెళ్లాలే కానీ జగన్ మాదిరి నియంత ధోరణితో, ఒంటెద్దు పోకడలతో దూకుడు ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
ఇక ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలో ఉంటే అభివృద్ధిలో భాగం అని ప్రజలను మభ్య పెట్టడం, ప్రతిపక్షంలోకి రాగానే విధ్వంసానికి నాంది అంటూ ప్రజలను రెచ్చకొట్టే ధోరణిలో ముందుకెళ్లడం సబబు కాదు. విద్యార్థులు కూడా ఎవరో రాజకీయ నాయకులు ఆడుకునే రాజకీయంలో చిక్కుకుని తమ భవిష్యత్ ను బలిపీఠంలో పెట్టకూడదు.
అభివృద్ధి అనేది ప్రజల కోసం, ప్రజల చేత జరగబడాలి, అప్పుడే రాష్ట్ర భవిష్యత్ తో పాటు అధికార పార్టీ భవిష్యత్ కూడా సుభిక్షంగా ముందుకెళుతోంది. లేదంటే ఓడలు బండ్లు…బండ్లు ఓడలవ్వడానికి ఐదేళ్ల సమయం సరిపోతుంది సుమీ..!




