జగన్‌ని వేల్లెత్తి చూపుతూ మనం చేస్తున్నదేమిటి?

Rushikonda palaces in Visakhapatnam amid debate over public fund usage

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 18 నెలలు. కానీ ఇంతవరకు ఈ ఒక్క విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతోంది.

విశాఖలో రుషికొండపై మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి రూ.500 కోట్ల ప్రజాధనంతో ఇంద్రభవనాల వంటి ప్యాలస్‌లు కట్టించుకున్నారు. కానీ ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోయింది.

ADVERTISEMENT

సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒకరి తర్వాత మరొకరు వచ్చి ఆ ఇంద్ర భవనాలను చూసి వెళ్ళారు. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

కానీ ఈ విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి జగన్‌ రూ.500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి వాటిని నిర్మించుకున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు. వాటి నిర్వహణ కొరకు నెలకు రూ. 25-30 లక్షల వరకు ఖర్చు అవుతోందని చెపుతున్నారు. అది ప్రభుత్వానికి భారంగా మారిందని మంత్రులే చెపుతున్నారు.

ఆ ఇంద్రభవనాలు 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు సిద్ధమయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 24 నెలలు గడిచిపోయాయి. నెలకు 25 లక్షలే అనుకున్నా ఇంతవరకు 6 కోట్లు దానిపై ప్రభుత్వం ఖర్చు చేసింది. అయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

కనుక నిర్ణయం తీసుకుని అమలుచేసే వరకు ఈ మీటర్ ఇలాగే గిర్రున తిరుగుతుంటుంది. నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ప్రభుత్వం మరో ఆరు నెలలు సమయం తీసుకుంటే మరో కోటిన్నర వెళ్ళిపోతుంది.

జగన్‌ 500 కోట్లు ప్రజాధనం వృధా చేశారని మంత్రులు ఆరోపిస్తున్నప్పుడు, రుషికొండ ప్యాలస్‌ల విషయంలో ప్రభుత్వ 18 నెలలుగా నిర్ణయం తీసుకోకుండా దాపు 6-7 కోట్ల ప్రజాధనం వృధా చేసినట్లే కదా? ఈ భవనాలే ఏ మంత్రివో ఎంపీ, ఎమ్మెల్యేవైతే ఇంతకాలం పెట్టుకొని కూర్చుంటారా?

ఈ విషయంలో జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు నిజమే. కానీ ఆయనని వేలెత్తి చూపుతున్నవారు కూడా ఇంత డబ్బు వృధా అవుతోందని తెలిసి ఉన్నప్పటికీ వేగంగా నిర్ణయం తీసుకోకుండా ఏళ్ళకు ఏళ్ళు కాలక్షేపం చేయడం సమంజసమేనా? ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించడం మానుకొని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories