గతంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విజయసాయి రెడ్డి నంబర్: 2గా ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ వెలుగు వెలిగారు. జగన్ కోటరీలో కీలకంగా మారిన సజ్జల వల్లనే తన స్థానం 2 నుంచి 2,000కి పడిపోయిందని విజయసాయి రెడ్డి చెప్పుకొని బాధపడ్డారు కూడా. కానీ ఎన్నికలలో వైసీపీ ఓటమికి సజ్జల శల్య సారధ్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తడంతో జగన్ కొన్ని నెలలు ఆయనని పక్కన పెట్టేశారు. కానీ అలవాటులేని ప్రెస్మీట్లతో నవ్వులపాలవుతున్నందున జగన్ మళ్ళీ సజ్జలని తెచ్చుకున్నారు. అప్పటి నుంచే మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే, వైసీపీ లౌడ్ స్పీకర్స్ అంబటి రాంబాబు వంటివారు బుద్దిగా ఆయన పక్కన నిలబడి వినడం అలవాటు చేసుకున్నారు.
అయితే పోసాని కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయ్యి ఉండి ఉంటే ఆయన పరిస్థితి నేడు ఏవిదంగా ఉండేదో కానీ ముందస్తు బెయిల్ తీసుకొని తృటిలో అరెస్ట్ తప్పించుకున్నారు.
కానీ ఇప్పుడు సాక్షి మీడియాని సమర్ధించుకుంటూ అమరావతి, రాష్ట్ర ప్రభుత్వం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా సజ్జల అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినందుకు పలువురు వైసీపీ నేతలపై ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయని, జైలుకి వెళ్ళాల్సి వస్తుందని తెలిసి ఉన్నప్పుడు, మళ్ళీ కొత్త కేసులలో చిక్కుకోకుండా రాజకీయాలు చేసుకోవడం తెలివైన పని.. అని సజ్జలకు తెలియదనుకోలేము. కానీ ఈసారి తన అరెస్టుకి తానే స్కెచ్ వేసుకున్నారు.
ఎందువల్లనంటే, ఇది వరకు జగన్ విధేయులుగా ఉంటే చాలనుకునే వైసీపీ నేతలు, ఇప్పుడు ఒక్కసారైనా జైలుకి వెళ్ళి వస్తే జగన్ మెప్పు పొందవచ్చని భావిస్తున్నట్లున్నారు. అందుకే సజ్జల అంతగా రెచ్చిపోయినట్లున్నారు.
కనుక నేడో రేపో ఆయనని పోలీసులు అరెస్ట్ చేస్తే, విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీలో ఖాళీ అయిన నంబర్: 2 స్థానంలోకి సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చేస్తారు.
ఈ వివాదానికి కారణమైన జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు హాజరయ్యి సహకరిస్తానని హైకోర్టుకి తెలియజేశారు. కృష్ణంరాజుకి ఇప్పుడు కేసు, అరెస్ట్ భయం పొంచి ఉన్నప్పటికీ జగన్ మెప్పుకి అర్హత సాధించారు. కనుక భవిష్యత్లో ఎప్పుడైనా ఆయనకు మేలు చేయవచ్చు.




